ప్రెజర్‌ పీక్స్ వెంకయ్యకే!

ప్రత్యేక హోదా విషయంలో ఎక్కువ ప్రెజర్‌ ఫీలవుతున్నది వెంకయ్యనాయుడే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు, నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్‌ని ఈయనే తెరపైకి తెచ్చారు. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ద్వారా ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించింది వెంకయ్యనాయుడే.

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు, అప్పటి ప్రధానితో ఆ ప్రకటన చేయించగలిగారుగానీ, ఇప్పుడు కేంద్ర మంత్రంగా ఉండి కూడా నరేంద్రమోడీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇప్పించలేకపోతున్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తనకు కాంగ్రెసు పార్టీ గౌరవం ఇచ్చిందని, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి, సీనియర్‌ నాయకుడిగా తనుకు గౌరవం ఇవ్వలేకపోతోందని వెంకయ్యనాయుడు ఆవేదన చెందుతున్నారట. కానీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే నిర్ణయాలు తీసుకోవడం దశాబ్దాలపాటు కాషాయజెండా మోసిన వెంకయ్యనాయుడుకు చేతకావడంలేదు.

క్లిష్ట సమయాల్లో పార్టీని ఇబ్బందుల్లోకి లాగడం వెంకయ్యనాయుడుకి సముచితంగా అనిపించడంలేదట. ఇన్నేళ్ళ రాజకీయ జీవితం ఈ ప్రత్యేక హోదా కారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడాన్ని వెంకయ్యనాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారమ్‌. పార్టీలో సీనియర్‌ నాయకులకు ఇప్పటికే పొగపెట్టిన నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడుకు కూడా అలాగే పొమ్మనలేక పొగపెడుతున్నట్టున్నారు.