రాజ్‌తరుణ్‌కి బంపర్‌ ఆఫర్‌

‘అఖిల్‌’ సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌. తొలి సినిమా పరాజయం కావడంతో ఈ అమ్మడికి మరో అవకాశం రాలేదు టాలీవుడ్‌లో. హీరోయిన్‌గా నటనతో పాటు డాన్సులు కూడా ఇరగదీసింది ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమా ఫ్లాప్‌ కావడంతో దేనికీ పాపులర్‌ కాలేకపోయింది. దాంతో ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అజయ్‌దేవ్‌గణ్‌తో ‘శివాయ్‌’ సినిమా చేసింది. మళ్లీ టాలీవుడ్‌ వైపు ఈ అమ్మడి దృష్టి మళ్లినట్లు కనిపిస్తోంది.

టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ హీరో రాజ్‌తరుణ్‌ సరసన ఈ ముద్దుగుమ్మ ఛాన్స్‌ దక్కించుకున్నట్లు సమాచారం. అదే నిజమైతే ఆ తర్వాత ఈ అమ్మడు వరుసగా టాలీవుడ్‌లో సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యంగ్‌ హీరోల పక్కన జోడీగా ఈ అమ్మడు అదరహో అన్పించేలా ఉంటుంది. టాలీవుడ్‌లో ఇంకో సినిమా చేస్తేనే కదా తన టాలెంట్‌ ఏంటో ప్రేక్షకులకి తెలుస్తుంది. అందుకే ఖచ్చితంగా రెండో సినిమా చేస్తాను అని ఖచ్చితంగా చెబుతోంది కూడా.

ఛాన్సిస్తే తన టాలెంట్‌ని బయట పెడతానంటోంది. డాన్సుల్లోనే కాకుండా నటనలో కూడా వేరియేషన్స్‌ చూపించగల టాలెంట్‌ తనలో ఉందంటోంది ముద్దుగుమ్మ సాయేషా. అసలే హీరోయిన్స్‌ కొరత, ఒకవేళ అందమైన ముద్దుగుమ్మలు దొరికినా, వాళ్లలో యాక్టింగ్‌ టాలెంట్‌ అంతంత మాత్రంగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో అందం, నటన అన్నీ పుష్కలంగా ఉన్న సాయేషాను ఆహ్వానించడం శుభపరిణామమే కదా. ఏదేమైనా రాజ్‌తరుణ్‌కి ఇది నిజంగానే బంపర్‌ ఆఫర్‌.