సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో మోదీ ప్రభుత్వంపై అడిగిన ప్రశ్నలు అభ్యర్థులకు నిజమైన పరీక్ష పెట్టాయి. మొత్తం వంద ప్రశ్నల్లో మోదీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాల గురించే 13 కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, స్టాండప్ ఇండియా, ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజనలపై ప్రశ్నలు అడిగారు.
వీటిపై చాలామంది అభ్యర్థులు మండిపడుతున్నారు. ఆధునిక చరిత్ర, జాగ్రఫీ, పాలటీలాంటి ముఖ్యమైన అంశాలను వదిలేసి ప్రస్తుత ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడగటం ఏంటని ఇండోర్కు చెందిన వినీత్కుమార్ అనే అభ్యర్థి ప్రశ్నించాడు.భారత నేషనల్ కాంగ్రెస్ చీలిక వెనుక కారణమేంటన్న ప్రశ్న తప్ప ఆధునిక భారత చరిత్రపై ప్రశ్నలేవీ రాలేదని భోపాల్కు చెందిన స్వాతి మిశ్రా చెప్పింది.
ఈ ఏడాది కరెంట్ అఫైర్స్, పాలన, న్యాయం, సామాజిక, ఆర్థిక చట్టాలపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. కరెంట్ అఫైర్స్ నుంచి 18 ప్రశ్నలు వచ్చాయి. ఇన్ ద న్యూస్ విభాగంలో అడిగిన ప్రశ్నలు అభ్యర్థులను గందరగోళానికి గురిచేశాయి.