ఏపీలో నెల రోజులుగా జనాల కాన్సంట్రేషన్ అంతా నంద్యాల ఉప ఎన్నికమీదే ఉంది. నంద్యాలలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ ప్రచారం సాగినా పోలింగ్ ముగిశాక అధికార పార్టీకి కాస్త ఎడ్జ్ ఉన్నట్టు సర్వేలు చెపుతున్నాయి. ఇక నంద్యాల ఫలితం తేలడం ఒక్కటే మిగిలి ఉంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ కార్పొరేషన్కు జరుగుతోన్న ఎన్నికలపైనే ఉంది.
ఏపీలో ఈ మూడేళ్లలో జరుగుతోన్న మేజర్ ఎన్నికల్లో నంద్యాల ఎన్నిక తర్వాత ఆ రేంజ్లో ఎట్రాక్ట్ చేస్తోంది కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక. కాకినాడ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన కాపు ఉద్యమ ప్రభావం గట్టిగా ఉన్న ప్రాంతంలో జరుగుతోన్న ఈ ఎన్నికల వేళ టీడీపీ వ్యూహలు చాలా వరకు రివర్స్ అయ్యి ఆ పార్టీకి షాక్లుగా మారాయి.
ముందుగా ఈ ఎన్నికల బాధ్యతలను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం కం హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అప్పగించగా ఆయన ఎన్నికల వ్యూహాల అమల్లో ఫెయిల్ అవ్వడంతో చంద్రబాబు ఆయన్ను హుటాహుటీన తప్పించి ప్రత్తిపాటి పుల్లారావుకు అప్పగించారు. ఇక్కడ ఎన్నికల వ్యూహాలు అమలు చేయడంలో చినరాజప్ప చేతులు ఎత్తేయగా జిల్లాకే చెందిన మరో మంత్రి యనమల రామకృష్ణుడు సైతం తెరచాటుకే పరిమితమైపోతున్నారు.
ఇక ఇక్కడ బీజేపీకి మిత్రపక్షం కోటాలో 9 సీట్లు కేటాయించారు. ఈ 9 సీట్లు తమవే అన్న ధీమాతో వైసీపీ ఉంది. ఏపీ బీజేపీకి చేసిన మోసాన్ని గమనిస్తోన్న జనాలు బీజేపీపై రగిలిపోతున్నారు. ఆ ఎఫెక్ట్ గట్టిగా పడే సూచనలు ఉన్నాయి. ఇక ఆరు డివిజన్లలో టీడీపీలో బలమైన నాయకులుగా ఉన్న వారు సీట్లు రాకపోవడంతో రెబల్స్గా పోటీ చేస్తున్నారు. ఈ దెబ్బ కూడా పార్టీకి గట్టిగా తగలనుంది. వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
మనయల అయితే ఎన్నికల మేనేజ్మెంట్లో చాలా లోపాలు జరుగుతుండడంతో తనకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని చేతులు దలిపేసుకునేలా వ్యవహరిస్తున్నారన్న టాక్ వచ్చేసింది. మరోవైపు వైసీపీలోను ఇక్కడ గ్రూపులు నాలుగైదు ఉన్నా విజయసాయిరెడ్డి ఎంట్రీ ఇచ్చి అక్కడ వాటిని చాలా వరకు సరిచేశారు. టీడీపీకి అటు కాపులు ఏం చేస్తారన్న ఆందోళన ఓ పక్కన ఉంటే మరోవైపు ఎన్నికల మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం, జిల్లాకు చెందిన మంత్రి పట్టించుకోకపోవడం, ఇంటర్నల్ సమస్యలు పెద్ద మైనస్గా మారాయి. చంద్రబాబు ఇప్పటికి అయినా రంగంలోకి దిగి వీటిని పరిష్కరించకపోతే టీడీపీకి ఇబ్బందులు తప్పవు.