ఏపీలో అధికార టీడీపీ ఈ మూడేళ్లలో రాజకీయంగా సాధించింది ఏంటంటే అది ఒకే ఒక్కటి… విపక్ష వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం. చంద్రబాబు అభివృద్ధి ద్వారా బలోపేతం అవ్వాలన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాలనే ప్రయత్నానికి తెరదీశారు. వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు చంద్రబాబు వేసిన ఈ ఎత్తులు ఇప్పుడు బాబుకే పెద్ద ముప్పు కాబోతున్నాయి.
ఏపీ టీడీపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే టీడీపీలో ఓ వెలుగు వెలిగిపోదామని వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఇక్కడ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన లేదు, చాలా చోట్ల టీడీపీ ఇన్చార్జ్ల పెత్తనమే నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందో ? రాదో ? తెలియడం లేదు.
ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కొందరు ఎమ్మెల్యేల్లో అంతర్మధనం మొదలయిందంటున్నారు. 21 మంది పార్టీ ఫిరాయిస్తే వారిలో నలుగురికి మాత్రం మంత్రి పదవులు వచ్చాయి. మిగిలిన వారిలో చాలా మంది కార్పొరేషన్ పదవులు ఆశించారు. అయితే వారికి బాబు ఉత్తచేతులే చూపించారు. కనీసం నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇవ్వకపోవడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు బాబు తీరుపై రగిలిపోతున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందో ? రాదో ? అన్న సందేహంతో ఉన్న కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరిగి వైసీపీ గూటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు ఓవరాల్గా చూసుకుంటే ఓ 10 మంది వరకు ఇప్పుడు వైసీపీ అధిష్టానంతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది.
మాకేం వద్దు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీటు ఇస్తామని హామీ ఇస్తే చాలు, తిరిగి పార్టీలోకి వచ్చేస్తామని చెపుతున్నారట. ఫిరాయింపు ఎమ్మెల్యేలను టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా లెక్కచేయడం లేదు. నియోజకవర్గాల పెంపు లేకపోవడం, బీజేపీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందన్న గ్యారెంటీ లేకపోవడం, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టుపై గ్యారెంటీ లేకపోవడం, ప్రభుత్వంపై పెరుగుతోన్న వ్యతిరేకత లాంటి అంశాలు వీరిని భయపెడుతున్నాయి. అందుకే వీరు తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారు. వీరు వైసీపీలోకి రివర్స్ జంప్ చేస్తే అది టీడీపీకి షాకులకే బిగ్ షాక్ అవుతుంది.