బాహుబలి 1,2 సాధించిన విజయం తర్వాత తెలుగు స్టార్ హీరోలు ఎవ్వరూ రికార్డుల గురించి మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు. బాహుబలి 2 సాధించిన అసాధారణ విజయం, రికార్డుల ముందు మిగిలిన స్టార్ హీరోల రికార్డులు సైతం చాలా చాలా చిన్నబోతున్నాయి. బాహుబలిని బీట్ చేయాలంటే ఈ రేంజ్ సినిమా చేయాలి. ఈ రేంజ్ సాహసం మన తెలుగులో ఎంత మంది హీరోలు చేస్తారన్నది ప్రశ్నార్థకమే.
ఇదిలా ఉంటే ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన 151వ సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఖైదీ సినిమాకు చెర్రీతో చాలా లో బడ్జెట్ పెట్టించిన చిరు ఇప్పుడు ఉయ్యాలవాడ విషయంలో మాత్రం ఖర్చుకు ఎక్కడా రాజీపడడం లేదని తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా జాతీయ స్థాయిలో మార్మోగాలంటే భారీ బడ్జెట్ పెట్టాల్సిందేనని చిరు డిసైడ్ అయ్యాడట. సినిమా లేట్ అయినా ఓకే గాని సినిమా మాత్రం బాహుబలి రేంజ్లో ఉండాలని పదే పదే చెర్రీతో పాటు డైరెక్టర్ సూరికి చెపుతున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు జాతీయస్థాయిలో హైప్ తీసుకువచ్చేందుకు టాప్ టెక్నీషీయన్లనే రంగంలోకి దింపుతున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రముఖ నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.రెహ్మన్తో చర్చలు జరుపుతున్నారు. గ్రాఫిక్స్ కోసం ఏకంగా జాతీయ అవార్డు గ్రహీత కమల్ కన్నన్ ను రంగంలోకి దించారు.
ఇక హీరోయిన్ల విషయంలో కూడా బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పడుకొనే, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ పేర్లు వినపడుతున్నాయి. మరి బాహుబలిని బీటౌట్ చేసేలా ఉయ్యాలవాడ కోసం చిరు వేస్తోన్న ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో ..?