నక్కతోక తొక్కడమంటే ఇదేనేమో! ఇక మంత్రి వర్గం నుంచి దాదాపు పేరు తొలగించే సమయానికి ఒకే ఒక్క విజయం గంటా శ్రీనివాసరావును కాపాడింది. ఆయనపై అప్పటివరకూ గుర్రుగా ఉన్న చంద్రబాబు.. కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంతో.. యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలోనూ ఆయన చాలా సేఫ్గా ఉన్నారు! ఆయన్ను టార్గెట్ చేస్తూ.. ఎంతమంది గురిపెట్టినా అవి చివరకు లక్ష్యం తప్పుతున్నా యనడంలో సందేహం లేదు!
ఏప్రిల్ 6న మంత్రివర్గ విస్తరణ జరుగుతుందున్న ఊహాగానాలు కొందరి మంత్రల గుండెల్లో రైళ్లు పరిగెట్టేటా చేస్తున్నాయి. పార్టీలోకి కొత్తగా చేరిన వారికి అవకాశం కల్పించడం, పనితీరు బాగాలేని వారిని తొలగించడం లేదా శాఖ మార్చడం వంటివి జరుగుతాయనే లీకులు వీరి గుండె దడను మరింత పెంచుతున్నాయి. ఈ లీకులపై ఎక్కువ మథన పడిన వారిలో మంత్రి గంటా శ్రీనివాస్ ఒకరు. తుని దుర్ఘటన నుంచి తాజాగా బ్యాంకుల ఆస్తు జప్తు వరకూ ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. తుని రైలు దుర్ఘటన సమయంలో ఘంటా ఘాటుగా స్పందించకపోవడం, ప్రభుత్వాన్ని కూల్చేస్తా అని జగన్ అన్నప్పుడల్లా ఆయనపై ఊహాగానాలు గుప్పుమన్నాయి.
జిల్లాలోని తోటి మంత్రితో విభేదాలు వంటి అంశాలపై సీ ఎం గుర్రుగా ఉన్నారని ఉప్పందింది. తాను భాగస్వామిగా పనిచేసిన ప్రత్యూష కంపెనీ వ్యవహారం పీకకు చుట్టుకోవడం వెనుక ఏదో రాజకీయం ఉందని మంత్రి భావించారు. అయితే తన పదవికి ముప్పు రాకుండా గంటా పావులు కదుపుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తనను తాను ప్రాజెక్ట్ చేసుకోవడంలో ఉన్న చాణక్యతకు మంత్రి గారు మరింత పదును పెడుతున్నారు. కడప ఎమ్మెల్సీ ఎన్నిక విజయంలో సీఎం తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచింది గంటానే.
అపూర్వ విజయాన్ని అందించిన కీలక నేతగా బాగానే ప్రొజెక్ట్ అయ్యారు. ఇక కాపాడే కాపు ముద్ర ఉండటంతో ఆయన్ను సీఎ టచ్ చేయరని గంటా బ్యాచ్ భావిస్తోంది. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ అంశంలోను ముఖ్యమంత్రి ఎక్కడా సంబంధిత శాఖ మంత్రి అయిన గంటాను కానీ, ఈ అంశంలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి నారాయణను కానీ బాధ్యులు చేసే సాహసం చేయలేదు. ఈ పరిణామం గంటా అండ్ కో టీడీపీలో మరీ ముఖ్యంగా ప్రభుత్వంలో ఎంత పట్టు సాధించిందో కళ్లకు కడుతోందని విమర్శకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక గంటా పదవి సేఫ్ అని ధీమాగా ఉన్నారు.