పొలిటికల్ లీడర్లు. మాట్లాడే ప్రతి మాటకీ రిఫ్లెక్షన్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న వైసీపీ లేడీ లీడర్ రోజా మాటలకైతే ఇటు పత్రికలు సహా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం, ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజా చేసే ప్రతి కామెంట్పైనా రియాక్షన్ కూడా అంతే స్పీడ్గా ఉంటోంది. ఇక, తాజా విషయానికి వస్తే.. కృష్ణా జిల్లాలో జరిగిన జేసీ బస్సు ప్రమాదం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. అదీ ఇదీ అని కాకుండా అన్ని మీడియా సంస్థలూ దీనికి బాగానే కవరేజీ ఇచ్చాయి.
కొందరు దీనిని ప్రమాదం దృష్టిలో చూస్తూ.. అంతవరకే పరిమితం చేయగా.. జగన్ అండ్ కో సాక్షి మీడియా సంస్థలు మాత్రం ప్రమాదం కమ్ పొలిటికల్ యాంగిల్ను జోడించి కొట్టారు. దీనికి ప్రధాన కారణం జేసీ దివాకర రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే కావడం, ఇటీవల జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం అని అందరికీ తెలిసిందే. ఇక, ప్రమాద స్థలానికి, ఆస్పత్రికి ప్రతిపక్ష హోదాలో వెళ్లిన జగన్.. ప్రభుత్వంపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. అదేసమయంలో కలెక్టర్ నుంచి బిల్ కలెక్టర్ వరకు అందరిపైనా మాటలతో విరుచుకుపడ్డారు.
జగన్ ప్రతికూల మీడియా ఈ వ్యాఖ్యలను పదే పదే ప్రచారం చేస్తూ.. జగన్ను వ్యంగ్యంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. దీనిపై స్పందించిన రోజా.. ఆ క్లిప్పింగులను ప్రసారం చేయొద్దు ప్లీజ్ అంటూ మీడియా ను కోరింది. ఇప్పుడు ఇదే జగన్ పరువును తీసేసేలా ఉందని వైసీపీ నేతలే విమర్శలు ప్రారంభించారు. మీడియాని రోజా రిక్వెస్ట్ చేసిన విధానం చూసినవాళ్ళకు ఎవ్వరికైనా జగన్ తప్పుగా మాట్లాడాడన్న విషయం అర్థమయిపోయేలా ఉంది.
మా అధినేత ఏదో తప్పుగా మాట్లాడాడు…మీరు ఆ మాటలను హైలైట్ చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేసినట్టుగానే ఉన్నాయి రోజా మాటలు. అని వైసీపీ నేతలే అనుకుంటున్నారు. మొత్తానికి రోజా మాటలతో జగన్ పరువు పోయిందని అంటున్నారు వైసీపీ నేతలు. మరి దీనిపైనా ఫైర్ బ్రాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.