ఏపీ ప్రధాన, ఏకైక విపక్షం.. వైకాపాకి కొత్త ఊపు రానుందా? ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా ఉన్న కాపు సామాజిక వర్గం త్వరలోనే జగన్ బాట పట్టనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దీనికి ప్రధాన కారణం.. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. రేపో మాపో.. జగన్ జట్టులో చేరనున్నారట! వినడానికి కొంత ఆశ్చర్యం అనిపించినా.. ఇది నిజమేనని అంటున్నారు కొందరు. కాంగ్రెస్లో కీలక నేతగా, ముఖ్యంగా వైఎస్ హయాంలో రవాణా మంత్రిగా ఉన్న కన్నా.. తనదైనశైలిలో చక్రం తిప్పారు. తర్వాత ఆయన సమైక్యాంధ్రలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్కు గుడ్బై చెప్పి.. బీజేపీ చెంత చేరిపోయారు.
అయితే, బీజేపీలో ఆయనకు అనుకున్నంత మైలేజీ రాలేదు. దీనికి తోడు చంద్రబాబు కూడా మిత్రపక్షమే అయినప్పటికీ.. కొందరి బీజేపీ నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకనేతగా ఉన్న కన్నా ఇప్పుడు వార్తల్లో లేకుండా పోయారు. దీంతో అనుకున్నది దక్కకపోయే సరికి కన్నా వర్గం ఇప్పుడు మరోసారి పార్టీ మారాలని భావిస్తోందట. అయితే, ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయం జగన్ పార్టీయే కాబట్టి.. ఆయన చెంతకు చేరుకోవాలని కన్నా వర్గం రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోతాయని తెలుస్తోంది.
నిజానికి 2014లో టీడీపీకి అండగా నిలిచిన కాపు వర్గం ఇప్పుడు అదే చంద్రబాబుకి యాంటీ అయిపోయింది. పైకి మాత్రం బాగానే ఉన్నా.. సమయం చూసుకుని బాబుకు దెబ్బేయాలని కాపు లు భావిస్తున్నారు. ఇక, కన్నా కూడా కాపు వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన జగన్ చెంతకు చేరడాన్ని బట్టి.. ఇకపై కాపులు జగన్కి మద్దతిచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.
కాపు వర్గానికే చెందిన పవన్ పార్టీ పెట్టినా.. ఇంత వరకు తన ప్రాధాన్యం ఏమిటో చెప్పలేదు. అంతేకాకుండా కాపులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చున్నాడు. దీంతో పవన్ పక్షాన నిలిచేందుకు కాపులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతోనే కన్నా.. ఇప్పుడు జగన్ చెంతకు చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఆయన గుంటూరు వెస్ట్ సీటుతో పాటు మరో సీటు తనకు ఇవ్వాలని కండీషన్ పెడుతున్నాడట. మరి కన్నా కండీషన్లు జగన్ ఎంత వరకు ఓకే చేస్తారో ? కన్నా వైసీపీ ఎంట్రీ ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలి.