ప్రొద్దుటూరు టీడీపీ నేతల మధ్య టికెట్ రచ్చ..!

ప్రొద్దుటూరు అసెంట్లీ టీడీపీ టికెట్ కోసం భారీగా పోటీ నెలకొంది. సీనియర్ లీడర్లతో పాటు సీజనల్ నేతలు కూడా టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఖాయమైందంటూ అనుచరుల దగ్గర హడావుడి చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం వైఎస్ జగన్ మాత్రం వై నాట్ 175 అని అంటున్నప్పటికీ… సొంత జిల్లాలో మాత్రం పరిస్థితి అలా లేదు. అధికార వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో సైకిల్ గుర్తు పై పోటీ చేసేందుకు పలువురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొత్తనేతలు ఉత్సాహం చూపుతున్నారు. అధిష్టానం దృష్టిలో పడేందుకు నియోజకవర్గంలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, ప్రస్తుత నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న డా.ప్రవీణ్ కుమార్ రెడ్డిల మధ్య టికెట్ కోసం గట్టిపోటీ నడుస్తోంది.

చంద్రబాబుతో ఇటీవల డా.ప్రవీణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. దీంతో టికెట్ కన్ఫామ్ అయినట్లైనని ప్రవీణ్ వర్గం చెబుతుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసలరెడ్డితో కలసి ప్రవీణ్ రెడ్డి కూడా ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ నిర్వహించడం బలప్రదర్శననే టాక్ వినిపిస్తోంది. డా.ప్రవీణ్ రెడ్డి ర్యాలీ ఎపిసోడ్ పై మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్న తనకే టికెట్ దక్కుతుందని ఇప్పటికే తన వర్గం నేతల దగ్గర ధీమా వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఫైనలైందంటూ ప్రవీణ్ రెడ్డి వర్గం చేసే ప్రచారాన్ని ఓ వీడియో రిలీజ్ చేసి తిప్పికొడుతున్నారు. మరోవైపు… టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని ధైర్యంగా పనిచేశానంటున్న ప్రవీణ్ రెడ్డి.. పార్టీ కోసం ఎన్నో కేసుల్లో జైలుకెళ్లానని చెబుతున్నారు.

చాలాకాలంగా రాజకీయ పర్యటనలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కూడా యాక్టివ్ అయ్యారు. తాను టీడీపీలోనే కొనసాగుతున్నట్లు తాజాగా ప్రకటించారు. సర్వేల చర్చ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో సాగుతోంది. వరదరాజుల రెడ్డికి సీటు ఇస్తే గెలుపు ఖాయమని సర్వే రిపోర్టులు చెబుతున్నాయంటూ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆయన దగ్గర తగినంత ధనబలం లేకపోవడం ప్రతికూల అంశంగా మారిందని నియోజకవర్గంలో టాక్.

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ సోదరుడు సురేశ్ నాయుడు కూడా పోటీలో ఉన్నారు. టికెట్ కోసం తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్నప్పుడు అభ్యర్థిగా ఎవరున్నా విజయం సాధిస్తారని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తమ కుటుంబానికి అనుచరులు ఉన్నారని, గ్రామ గ్రామాన పరిచయాలు ఉన్నాయని ఏకరవు పెడుతున్నారు. దీంతో ప్రొద్దుటూరులో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆశావహులు ఎక్కువయ్యారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రస్తుత ఇంఛార్జ్ డా.ప్రవీణ్ రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది.