పవర్స్టార్ పవన్కళ్యాణ్ మూవీకి కొబ్బరికాయ కొట్టారంటే ఆ సినిమా మీద వచ్చే వార్తలు, ఊహాగానాలకు కొదవే ఉండదు. పవన్ ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలను వరుస పెట్టి పట్టాలెక్కించేస్తున్నాడు. ప్రస్తుతం డాలీ డైరెక్షన్లో కాటమరాయుడు సినిమాలో నటిస్తోన్న పవన్ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, త్రివిక్రమ్ సినిమాకు సమాంతరంగానే కోలీవుడ్ డైరెక్టర్ ఆర్టి.నీశన్ డైరెక్షన్లో మరో సినిమాలోను నటించనున్నాడు.
ఇదిలా ఉంటే పవన్ – త్రివిక్రమ్ కాంబో అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలోనే వీరిద్దరి కాంబోలో జల్సా – అత్తారింటికి దారేది సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ క్రమంలోనే మూడోసారి రిపీట్ అవుతోన్న ఈ కాంబో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుందన్న అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో వినిపిస్తోన్న ఓ వార్త పెద్ద సంచలనంగా మారింది. ఈ సినిమాలో పవన్తో పాటు మరో స్టార్ హీరో నటించనున్నాడట. చాలా రోజుల తర్వాత.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను.. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో టాలీవుడ్ స్క్రీన్ పై చూపించిన త్రివిక్రమ్ ఇప్పుడు పవన్ సినిమాలో మరోసారి చూపించనున్నాడట.
పవన్ సినిమాలో ఉపేంద్ర కోసం త్రివిక్రమ్ అదిరిపోయే క్యారెక్టర్ డిజైన్ చేశాడట. ఈ క్యారెక్టర్ విన్న ఉపేంద్ర ఇంప్రెస్ అయ్యి వెంటనే ఈ రోల్ ఓకే చేశాడట. ఇక ఇదే సినిమాలో చాలా మంది ప్రముఖులు ఓకే అయినట్టు టాక్. అత్తారింటికి దారేది సినిమాలో పవన్కు తాతగా చేసిన బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీతో పాటు.. హీరోయిన్లుగా కీర్తి సురేష్ – అనూ ఇమాన్యుయేల్ దాదాపు కన్ఫార్మ్ అయ్యారని టాక్.
ఇక కొలవెరి ఫేం అనిరుధ్ మ్యూజిక్ అందించే ఈ సినిమాకు దేవుడే దిగి వచ్చినా.. అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. ఎస్.రాధాకృష్ణ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుండగా….వచ్చే ఆగస్టు 15కు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.