మొత్తానికి బీజేపీ-జనసేన పొత్తు పెటాకులు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. రెండు పార్టీలు త్వరలోనే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల తర్వాత రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పేరుకు పొత్తు ఉంది గాని..ఎప్పుడు కలిసి పనిచేయలేదు. బిజేపి దాదాపు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తుందనే ఆరోపణలు తెచ్చుకుంది. బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు అధికార వైసీపీ కంటే ప్రతిపక్ష టిడిపినే టార్గెట్ చేసి విమర్శలు చేశారు.
దీంతో ప్రజలు వైసీపీ-బిజేపి దగ్గరగా ఉన్నాయని భావించే పరిస్తితి. ఇటు జనసేన సైతం బిజేపికి దూరంగానే ఉంటూ వస్తుంది. అదే సమయంలో టిడిపికి దగ్గరవుతుంది. అయితే పవన్ ఇప్పటికే పొత్తు రెడీ అయ్యారు. కాకపోతే బిజేపిని కూడా కలుపుకుని టిడిపితో వెళ్లాలని చూశారు. కానీ బిజేపి మాత్రం..టిడిపితో కలిసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. అటు టిడిపి సైతం బిజేపితో కలవడానికి ఆసక్తి లేదు. బిజేపితో కలిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ. అలాగే జనసేనతో కలిస్తే బెటర్ అని టిడిపి చూస్తుంది.
అయితే తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో బిజేపి-జనసేన పొత్తు దాదాపు ముగింపు దశకు వచ్చిందనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో జనసేన ఏ మాత్రం బిజేపికి మద్ధతు పలకలేదు. బిజేపి సైతం మద్ధతు అడగకుండా ఒంటరిగానే పోటీ చేసింది..దారుణంగా ఓడింది. బీజేపీకి పడిన ఓట్లు కంటే చెల్లని ఓట్లే ఎక్కువ. అంటే బిజేపి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయడానికి బిజేపి రెడీ అవుతుందని తెలుస్తోంది. అదే జరిగితే మళ్ళీ నోటాతో బిజేపి పోటీ పడాల్సిన పరిస్తితి. బిజేపిలో ఉంటే గెలవడం కష్టమని అర్ధమవుతుంది..అందుకే కొందరు నేతలు టిడిపి లేదా జనసేనలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.