ఒకప్పుడు ఏదైనా విషయంపై సర్వే చేపడితే.. దాని ఫలితాలపై జనాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి ఉండేది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి? వంటి అనేక విషయాలపై జరిగే సర్వేలను ప్రజలు, మేధావులు నిశితంగా గమనిస్తుంటారు. సర్వేల్లో వచ్చిన రిజల్ట్ దాదాపు తర్వాత నిజమయ్యేది. అయితే, రానురాను ఈ సర్వేలకు ప్రాధాన్యం తగ్గిపోతోంది. ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు సర్వేలు నిర్వహించడం, సర్వేఫలితాలు ఏకపక్షంగా ఉండడం వంటివి ప్రధానంగా గమనిస్తుండడంతో ప్రజలకు సర్వేలపై నమ్మకం పోతోంది.
ఇక, తాజా విషయానికి వస్తే.. మాత్రం.. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. చిల్లర దొరక్క సామాన్యుడి సాధారణ లైఫ్ భారీ ఎత్తున ప్రభావితం అవుతోంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో నల్లధనానికి కట్టడి వేస్తామని, అవినీతి తగ్గుతుందని ప్రధాని మోడీ చెప్పేసరికి జనాలు ఆనంద పడ్డారు. దేశం తీరు మారిపోయి.. నవ్య భారతం సాక్షాత్కరిస్తుందని భావించారు. అయితే, రానురాను ఆ నల్లకుబేరుల మాటేమిటోగానీ జనాలకు చిల్లర బాధలు ఎక్కువైపోయాయి.
దీంతో కేంద్రంపై విరుచుకుపడడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు అటు కేంద్రంలో ప్రధాని మోడీలు ఈ నోట్ల రద్దుపై పెద్ద ఎత్తున సర్వే నిర్వహించారు. అయితే, ఈ రెండు సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం గమనార్హం. బాబు సర్వేలో ప్రజలు.. నల్లధనం నిర్మూలించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నా, పెద్ద నోట్లను రద్దు చేసి ప్రత్యామ్నాయ చర్యలను గాలికి వదిలేశారన్న ఆగ్రహం ఆ సర్వేలో ప్రతిబింబించినట్టు సమాచారం.
కేంద్రం చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యలపై 72 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇక, మోడీ చేయించిన సర్వేలో 93 శాతం మంది మోడీ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారని బీజేపీ చెప్పుకుంటోంది. దీంతో ఈ రెండు సర్వేలపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిలో ఏది నిజమైన సర్వే అనేది ప్రశ్నగా మారింది.