ఆధిపత్య పోరులో అధికార వైసీపీ కేరాఫ్ అడ్రెస్గా మారినట్లు కనిపిస్తోంది. ఎక్కడైనా అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు అనేది సహజంగానే ఉంటుంది. కానీ ఏపీలో అధికార వైసీపీలో మాత్రం ఈ రచ్చ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి జిల్లాలో ఏదొక నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ నేతలకు పడటం లేదు. ఎంపీ-ఎమ్మెల్యే, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ, మంత్రి-ఎమ్మెల్యే ఇలా రకరకాలుగా నేతల మధ్య పోరు నడుస్తోంది.
ఇక ఈ ఆధిపత్య పోరుకు మచిలీపట్నం(బందరు) అతీతం కాదు. ఇక్కడ ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బాలశౌరిల మధ్య రచ్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో పేర్ని బందరు ఎమ్మెల్యేగా, బాలశౌరి బందరు ఎంపీగా గెలిచారు. అయితే ఎంపీ-ఎమ్మెల్యే కలిసే నియోజకవర్గంలో ముందుకెళ్లాలి. కానీ బందరులో ఆ పరిస్తితి లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిస్తితి. పేర్ని మంత్రిగా ఉన్న సమయంలో బందరులో ఎలాంటి కార్యక్రమం జరిగిన ఎంపీని ఆహ్వానించలేదు. అలాగే ఎంపీ ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు చేస్తే ఎమ్మెల్యే వర్గం అడ్డుకునే పరిస్తితి నడిచింది.
ఇలా ఎమ్మెల్యే-ఎంపీ వర్గాల మధ్య పోరు నడుస్తూ వస్తుంది. తాజాగా బందరు జరిగిన ఓ కార్యక్రమానికి పేర్ని నాని రాలేదు. ఎంపీ నిధుల నుంచి జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమానికి వేసిన ఆహ్వాన పత్రికలో పేర్ని పేరు చివరిలో పెట్టారు. పైగా ఎంపీ కార్యక్రమానికి అతిథిగా ఉన్నారు. దీంతో పేర్ని ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ప్రభుత్వ కార్యక్రమం అయినా సరే పేర్ని డుమ్మా కొట్టడంపై జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి వీరి పోరు వల్ల బందరులో వైసీపీకి డ్యామేజ్ పెరిగేలా ఉంది. అసలే టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం వైసీపీకి పెద్ద తలనొప్పిగా ఉంది. ఇప్పుడు ఈ పోరుతో ఇంకా దెబ్బపడేలా ఉంది.