వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న ప్రతిపక్ష టీడీపీ..ప్రతి జిల్లాలో మంచి ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. పక్కా వ్యూహాలతో ఎక్కువ సీట్లు గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సారి టీడీపీ పెద్ద టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే టీడీపీ 2, వైసీపీ 14 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాకూడదని టీడీపీ చూస్తుంది. ఇప్పటికే జిల్లాలో బలపడేలా ముందుకెళుతున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో టీడీపీకి 9 సీట్లలో ఆధిక్యం వచ్చిందని ఆ పార్టీ అంతర్గత సర్వేల్లో తేలిందట. పార్టీ వర్గాల అంతర్గత సమాచారం ప్రకారం జిల్లాలో 9 సీట్లలో టీడీపీకి బలం ఉందని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విజయవాడ తూర్పునే కౌంట్ చేస్తున్నారు. అలాగే విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, పెడన, మైలవరం, పెనమలూరు, మచిలీపట్నం, నందిగామ, అవనిగడ్డ సీట్లని టీడీపీ కౌంట్ చేసుకుంటుంది.
గుడివాడ, గన్నవరం, నూజివీడు, తిరువూరు, కైకలూరు, పామర్రు, విజయవాడ వెస్ట్ సీట్లలో ఇంకా టీడీపీకి బలం పెరగలేదని తెలుస్తోంది. అయితే జనసేనతో పొత్తు లేకుండా సింగిల్ గా వెళితేనే 9 సీట్లు గెలుచుకో గలుగుతామని టీడీపీ సర్వేలో తేలిందట. అదే జనసేనతో పొత్తు ఉంటే విజయవాడ వెస్ట్, కైకలూరు లాంటి సీట్లని కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంటుందని లెక్కలు వేస్తుంది.
అయితే ఎన్నికల సమయంలో పొత్తులతోనే టీడీపీ ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. పొత్తు ఉంటే జిల్లాలో టీడీపీ-జనసేన కలిసి..12 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా..4 సీట్లు వైసీపీ దక్కించుకుంటుందని అంటున్నారు.