బంగారు తెలంగాణలో భాగంగా ఇప్పటికే జిల్లాల ఏర్పాటు, పాలన వికేంద్రీకరణపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు తన మంత్రి వర్గం విస్తరణపై దృష్టి పెట్టారా? రానున్న ఎన్నికల నేపథ్యంలో మరింత డెడికేటెడ్గా పనిచేసే టీంను ఎంచుకోనున్నారా? ఈ క్రమంలో మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది టీఆర్ ఎస్ వర్గాల నుంచి. వాస్తవానికి గత కొన్నాళ్లుగా కేసీఆర్ తన టంపై అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్యను కేసీఆర్ తొలగించారు. ఈ క్రమంలోనే అప్పట్లో మరికొంత మందిపై వేటు ఖాయమనే వాదన వచ్చింది.
ఇక, ఆ తర్వాత కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ కానీ, మంత్రులను తొలగించడం కానీ చేయలేదు. టీడీపీ నుంచి జంప్ చేసి కారెక్కిన తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వచ్చినా కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. అయితే, ఇటీవల ఆయన వ్యవహార శైలిపై ఆరోపణలు రావడంతో శాఖ మార్పుతో సరిపెట్టారు. కానీ, 2019 ఎన్నికలకు సమయం ముంచుకు వస్తుండడం, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేకున్నా.. మంత్రులు సరిగా పనిచేయడం లేదనే వాదన వినబడుతుండడంతో తన టీంను సంస్కరించుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ మంత్రి వర్గంలో మహిళలకు స్థానం లేదనే అపవాదును తుడిచేసుకోవాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే టీడీపీ సహా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మంత్రి వర్గాన్ని విస్తరిస్తే.. తప్పకుండా మహిళకు ఛాన్స్ లభించనుంది.
అదేవిధంగా జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి ఐదుగురికి ఉద్వాసన తప్పదని వినిపిస్తోంది. ఇక, వీరి స్థానంలో కాంగ్రెస్ , టీడీపీల నుంచి వచ్చిన కొందరికి ఛాన్స్ లభించనుంది. ముఖ్యంగా కేసీఆర్ హామీతోనే కారెక్కిన కొందరికి ఇప్పటి వరకు ఎలాంటి పదవులు దక్కలేదు. దీంతో వీరంతా ఎదురు చూస్తున్నారు. అయితే, గతంలో తలసాని వ్యవహారంతో తలనొప్పి తెచ్చుకున్న కేసీఆర్ ఈ దఫా ఎలా వ్యవహరిస్తారో చూడాలి. కొత్తగా క్యాబినెట్లోకి వచ్చేవారి పేర్లలో స్వామిగౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ కరుణా కటాక్షాలు ఎవరి మీద ఉంటాయో వెయిట్ అండ్ సీ..!