నిజమే! ఘటమనేని వారి ఇంటి చిన్నకోడలు మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారట! సామాజిక సేవలో బిజీగా ఉన్న నమ్రతా త్వరలోనే పాలిటిక్స్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఘట్టమనేని వంశానికి పాలిటిక్స్ కొత్తకావు. సూపర్స్టార్ కృష్ణ గతంలో కాంగ్రెస్కి మద్దతిచ్చారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు మద్దతుగా మాట్లాడారు కూడా. అదేవిధంగా ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కూడా కాంగ్రెస్లో ఉండేవారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు జగన్ పార్టీ వైకాపాలో కొనసాగుతున్నారు.
ఇక,సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ ఏకంగా గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి గతంలో కాంగ్రెస్లో మంత్రిగా ఉండి ప్రస్తుతం టీడీపీలో మహిళా నేతగా ఉన్నారు. మొత్తానికి ఘట్టమనేని వంశానికి పాలిటిక్స్ బాగానే వర్కవుట్ అవుతున్నాయి. ఇక, ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ కుమారుడు మహేష్ సతీమణి కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని అంటున్నారు.
సామాజిక సేవలో భాగంగా మహేష్.. గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల సొంత నిధులను వెచ్చించి గ్రామాన్ని డెవలప్ చేస్తున్నారు. దీంతో ఆయా కార్యక్రమాలను చూసుకునేందుకు తరచుగా మహేష్ సతీమణి నమ్రత బుర్రిపాలెం వచ్చి వెళ్తున్నారు. ఆయా పనులను ఆమె పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె మనసు పాలిటిక్స్వైపు మళ్లిందని అంటున్నారు విశ్లేషకులు. దీనికి మహేష్ బాబు అభిమానులు కూడా తోడయ్యారట. ఆమెను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారట. దీంతో 2019లో ఓకే కాకపోయినా భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆమె ఎమ్మెల్యే లేదా ఎంపీగాను పోటీ చేసే ఛాన్సులున్నాయి. అయితే అది ఏ పార్టీ అనేది ఇప్పుడే చెప్పలేం. అటు టీడీపీ, ఇటు వైకాపాలతో ఘట్టమనేని కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి.. నమ్రత ఏ పార్టీ తరఫున రాజకీయాల్లోకి వస్తారో అంచనా వేయలేం. మొత్తానికి మాత్రం.. ఘట్టమనేని ఇంటి కోడలు రాజకీయాల్లోకి రావడానికి మాత్రం లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే చెప్పొచ్చు.