రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరు ఎవరికీ శతృవులు కూడా కాదు. ఒకప్పుడు.. నోరు పారేసు కున్న నాయకులే.. తర్వాత కాలంలో అదే పంచన చేరిపోవడం.. రాజకీయాల్లో తప్ప ఇంకెక్కడైనా సాధ్యమేనా? అంటే.. కాదనే కామెంటే వినిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. గతంలో వైసీపీ తరఫున వాయిస్ వినిపించిన సినీ క్యారెక్టర్ నటుడు, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. అమ్మనా బత్తాయ్ డైలాగులతో వెండితెరను కుదిపేసిన పృథ్వీ.. ఇప్పుడు.. జనసేన పంచన చేరేందుకు రంగం రెడీ చేసుకున్నట్టు సమాచారం.
కొన్నాళ్లుగా పృథ్వీ.. పొలిటికల్ రీ ఎంట్రీపై ఇండస్ట్రీలోనూ.. పొలిటికల్ కారిడార్స్లోనూ చర్చ సాగుతోంది. త్వరలోనే ఆయన పవన్ చెంతకు చేరతారనే ప్రచారం కూడా ఉంది. అయితే.. అది ఎప్పుడనే విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుండగా.. తాజాగా పృథ్వీ .. జనసేన కార్యాలయంలో తీసుకున్న ఒక ఫొటోను.. సోషల్ మీడియాలో లీక్ చేశారు. త్వరలోనే తాను జనసేనలోకి ఎంట్రీ ఇస్తున్నాననే సంకేతాలను ఆయన బలపరిచారు. మంచి వాక్చాతుర్యం.. ఎలాంటి అంశంపైనైనా.. పదునైన మాటలతో మాట్లాడే వ్యక్తిగా.. పృథ్వీ గుర్తింపు తెచ్చుకున్నారనడంలో సందేహం లేదు.
గతంలో వైసీపీలో ఉనప్పుడు.. ఆయన టీడీపీ.. సహా.. జనసేనలపై విరుచుకుపడేవారు. కాపు సామాజిక వర్గానికే చెందిన పృథ్వీ.. వైసీపీలో ఎదగాలని అనుకున్నారు. రెండు సార్లు.. రాజమండ్రి నుంచి, గుంటూరు వెస్ట్ నుంచి టికెట్ ఆశించారు. అయితే.. రెండు సార్లు కూడా జగన్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కానీ, పార్టీ తరఫున మాత్రం మాట్లాడే ఛాన్స్ కల్పించారు. ఇక, 2014లోను.. తర్వాత.. గత ఎన్నికల సమయంలోనూ.. పృథ్వీ.. వైసీపీ తరఫున ప్రచారం చేశారు. అంతేకాదు.. తనదైన శైలిలో.. వైసీపీని బలపరిచే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే వైసీపీ అధినేత ఆయనకు ఎస్వీబీసీ చైర్మన్ పోస్టును ఇచ్చారు. అయితే.. పట్టుమని పదిమాసాలు కూడా కాకుండానే .. ఆయనపైలైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో జగన్ ఆయనను వెంటనే పదవి నుంచి పక్కన పెట్టారు. అంతేకాదు.. కనీసం వివరణ ఇచ్చుకునేందుకు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదని.. పలు మార్లు పృథ్వీనే.. మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
అటు సోషల్ మీడియాలోను.. ఇటు సాధారణ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ.. వైసీపీ తరఫున మాట్లాడిన తనకు ఇదే గిఫ్ట్ అంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. వైసీపీ వర్గాలు ఆయనను పట్టించుకోలేదు. ఇక, ఇప్పుడు జనసేన ఎంట్రీ ఇచ్చేందుకు పృథ్వీ సిద్ధం కావడం.. యువతలో పార్టీకి మరింత క్రేజ్ పెంచుతుందనే కామెంట్లు వస్తున్నాయి. అలాగే వచ్చే ఎన్నికల్లో పృథ్వి పార్టీ తరపున తన
సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తారని టాక్ ?