మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `కిన్నెరసాని`. కాశిష్ ఖాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి నిర్మించారు. రవీంద్రవిజయ్ కీలకపాత్ర పోషించారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ కిన్నెరసాని ట్రైలర్ను విడుదల చేశారు. `నీ ముందున్న సముద్ర అలల్ని చూడు. కోపగించుకొని సముద్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్టున్నాయి. కానీ సముద్రం వాటిని వదలదు. వదులుకోలేదు. నేను కూడా అంతే` అని హీరోయిన్ హీరో కళ్యాణ్ దేవ్ తో చెప్పే డైలాగ్తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్గా మరియు ఇంట్రస్టింగ్గా కొనసాగింది.
మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుందని ట్రైలర్ బట్టీ స్పష్టంగా అర్థమైంది. కళ్యాణ్ దేవ్ ఎవరో కోసమో అన్వేషణ సాగిస్తున్నట్లు.. ఏదో రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు. అదే సమయంలో కిన్నెరసాని అనే పుస్తకానికి, జరుగుతున్న కథకి సంబంధం ఏంటనే ఆసక్తిని క్రియేట్ చేశారు.
ఇక కళ్యాణ్ దేవ్ తనదైన నటన, హావభావాలతో అదరగొట్టారు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వంటి అంశాలు ఆకట్టుకున్నాయి. మొత్తానికి యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ ను టచ్ చేస్తూ వదిలిన ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారడంతో పాటుగా సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి లేటెందుకు మీరూ ట్రైలర్పై ఓ లుక్కేసేయండి.