నటి పూర్ణ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కేరళకు చెందిన ఈ బ్యూటీ.. 2004 లో `మంజు పొలోరు పెంకుట్టి` అనే మలయాళ చిత్రం ద్వారా తన సినీ ప్రస్థానంను ప్రారంభించింది. ఇటు సీమ టపాకాయ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పర్ణ.. రవిబాబు తెరకెక్కించిన అవును, అవును 2 చిత్రాల ద్వారా మంచు గుర్తింపును సంపాదించుకుంది.
ఆ తర్వాత అడపా తడపా చిత్రాలు చేసిన పూర్ణ.. కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న తరుణంలో ప్రముఖ డ్యాన్స్ షో `ఢీ`కి జడ్జ్గా మారి అందరి దృష్టినా పడింది. దాంతో పూర్ణకు మళ్లీ అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల్లో `అఖండ`. ఒకటి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూర్ణ.. సినిమా విషయాలతో పాటుగా వ్యక్తిగత విషయాలనూ షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. అఖండలో అవకాశం దక్కడం, బాలయ్య గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.
అలాగే తన కెరీర్ గురించి మాట్లాడుతూ..`నేను ఓ కథను కథలాగే వింటా. అది చిన్న చిత్రమా.. పెద్ద సినిమానా అని చూడను. పాత్ర నచ్చితేనే ఓకే చెబుతాను. డబ్బే కావాలనుకుంటే ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యొచ్చు. కానీ, కెరీర్ బాగుండాలి.. ఇండస్ట్రీలో సుదీర్ఘం కాలం పాటు సాగాలి అంటే మంచి పాత్రలనే చేయాలి. అందుకే సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తాన`ని చెప్పుకొచ్చింది. కాగా, పూర్ణ ప్రస్తుతం తెలుగులో ఆదితో ‘తీస్మార్ ఖాన్’ చిత్రం చేస్తోంది. మరియు తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ బ్యూటీ నటిస్తోంది.