తమిళనాడు రాష్ట్రంలో పది ఏళ్ల తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి తనదైన పాలనతో దూసుకుపోతున్నారు.
అంతేకాదు, అతి తక్కువ సమయంలో ఉత్తమ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేడు చెన్నై వెళ్లి ముఖ్యమంత్రి స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాలిన్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పారు. స్టాలిన్ తో పాటు ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అక్కడే ఉన్నారు.
ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్న ముఖ్యమంత్రిని కలవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలవడం సర్వ సాధారణమే. అయినప్పటికీ చిరు సీఎంను అభినందించడానికే కలిశారా..? లేక వేరే కారణం ఏదైనా ఉందా అంటూ టాలీవుడ్ లో చర్చ మొదలైంది.