నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుతో ముచ్చటగా మూడోసారి చేస్తున్న చిత్రం `అఖండ`. ఈ చిత్రంతో బాలకృష్ణకి జంటగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలె విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి భారీగానే ఖర్చు పెడుతున్నారట నిర్మాత. దీంతో ఈ సినిమా బడ్జెట్ ను గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.
బాలకృష్ణ పారితోషికం కాకుండానే ఈ చిత్రం కోసం రూ. 60 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారట. నిర్మాణ విలువల పరంగా ఎంతమాత్రం మేకర్స్ రాజీ పడటం లేదట. దీంతో బాలకృష్ణ కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇదేనని జోరుగా ప్రచారం జరుగుతోంది.