ఆర్మీ పాలనలోకి మరో దేశం..!

ఆర్మీ పాలనలోకి మరొక దేశం చేరింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌లో తిరుగుబాటు జరిగింది. దేశ రాజధాని నియామెలో జరిగిన ఈ తిరుగుబాటుకు అక్కడి సైన్యం మద్దతు తెలిపింది. ప్రెసిడెన్షియల్ గార్డ్స్ సభ్యులు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్ ను, ఆయన భార్యను నిర్బంధించారు.

ఆర్మీ అధికారులు ఆ దేశ పాలనపై పట్టుసాధించారు. ఇక నుంచి తామే దేశాన్ని పాలించనున్నామని ప్రకటించారు. దేశంలో పాలనా వ్యవహారాలను సైన్యమే చూసుకుంటుందని, ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని సంస్థలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దులను మూసేసి దేశంలో కర్ఫ్యూ విధించింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించింది.

పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్ 1960 వరకు ఫ్రాన్స్ పాలనలో ఉంది. స్వాతంత్ర్యం తర్వాత 2021లోనే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్. అయితే, బజౌమ్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అప్పటి నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రెండేళ్ల వ్యవధిలోనే ఏడుసార్లు సైనిక తిరుగుబాటు జరిగింది.

ప్రెసిడెన్షియల్ గార్డ్స్ జనరల్ ఒమర్ టిచనీని తొలగించాలని అధ్యక్షుడు బజౌమ్ నిర్ణయించడమే తిరుగుబాటుకు దారితీసినట్లు సమాచారం. నైగర్‌లో ఇక నుంచి తమ పాలనే కొనసాగనుందని.. ఆర్మీ మెన్ లైవ్ టీవీలో వచ్చి మరీ ప్రజలకు చెప్పారు. దీంతో ఆ దేశ ప్రజలతో సహా ప్రపంచం ఒక్కసారిగా ఉల్కిపడింది. నైగర్‌లో జరిగిన ఈ ఘటనను ప్రపంచంలోని పలు దేశాలు ఖండించాయి.