నాగ‌శౌర్య ` రంగబలి`కి ప్రేక్ష‌కులు బ‌లి.. అదొక్క‌టే కాస్త రిలీఫ్!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య హీరోగా తెర‌కెక్కిన చిత్రం `రంగ‌బ‌లి`. పవన్ బాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్ గా న‌టిస్తే.. సత్య, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్‌, మురళి శర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పవన్‌ సి.హెచ్ స్వ‌రాలు అందించాడు.

నేడు ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చింది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెర‌కెక్కించారు. కథ విషయానికి వస్తే అల్లరి చిల్లరిగా తిరిగే నాగ శౌర్యకు సొంత ఊరంటే ప్రాణం. ఊరిని, ప్రెండ్స్ ను వదిలి ఎక్కడికి వెళ్లకూడద‌ని గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఆ ఊళ్ళో మెడికల్ షాప్ నడిపే వాళ్ళ నాన్న ఫార్మసీ కోర్సు పూర్తి చేసి రమ్మని వైజాగ్ పంపుతాడు. అక్కడ యుక్తి తరేజాను చూసి ప్రేమలో పడతాడు.

వీరి ప్రేమను యుక్తి ఫాదర్ మురళీ శర్మ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడు. కానీ, ఒక కండీషన్ పెడతాడు. ఆ కండీషన్ ఏమిటీ? హీరో ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే రంగబలి చిత్రం. అయితే క‌థ‌, క‌థ‌నంలో ద‌మ్ము లేద‌ని ప్రేక్ష‌కుల‌కు తేల్చేశారు. ఎక్కడా కొత్త సీన్‌లు క‌నిపించ‌వు. ఫస్ట్ హాఫ్‌లో స‌త్య కామెడీ మాత్ర‌మే ప్రేక్ష‌కుల‌కు కాస్త రిలీఫ్ ఇస్తుంది. నాగ‌శౌర్య ఎప్ప‌టిలాగే లుక్స్‌, యాక్టింగ్ ప‌రంగా మంచి మార్కులు వేయించుకున్నారు. ఇక‌ సెకండాఫ్ ఏ మాత్రం ఆక‌ట్టుకునే విధంగా ఉండ‌దు. క్లైమాక్స్ మరీ నీరసంగా అనిపిస్తుంది. పాటలు కూడా యావ‌రేజ్ అనే చెప్పాలి. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే రంగ‌బ‌లికి ప్రేక్ష‌కులు బ‌లి కావ‌డం ఖాయమ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.