యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రీసెంట్ గా `మేమ్ ఫేమస్` మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. మణి ఏగుర్ల, మౌర్య, సార్య, సిరి రాశి, శివ నందన్, మురళీధర్ గౌడ్ ఇలా మొత్తం కొత్త తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించి ఈ చిత్రం మే 26న విడుదలైంది. మొదట నెగటివ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత మంచి మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.
అయితే విడుదలకు ముందే ఈ సినిమా అద్భుతం అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ ఇచ్చారు. చిత్ర టీమ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. అయితే మహేష్ బాబు చేసిన ట్వీట్ ఈ మూవీపై భారీ అంచనాలు పెంచినా.. మరోవైపు తీవ్ర వ్యతిరేకత కూడా ఏర్పడేలా చేసింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో మేమ్ ఫేమస్ లాంటి చిన్న సినిమా చూడటం, పైగా విడుదలకు ముందే రివ్యూ ఇవ్వడం విడ్డూరంగా ఉంది, సినిమాపై హైప్ పెంచడం కోసమే మహేష్ బాబు చేత ట్వీట్ చేయించారని విమర్శలు గుప్పించారు.
మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా `మా అభిమాన హీరో మీకు క్లోజ్ అని ఆయన్ని తెగ వాడేస్తున్నారు` అంటూ మేమ్ ఫేమస్ నిర్మాణ సంస్థపై మండిపడ్డారు. అయితే తాజాగా ఈ విషయంపై ఓపెన్ అవుతూ సుమంత్ ప్రభాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. `మహేష్ బాబు గారికి మా సినిమాని చూపించడమే పెద్ద తప్పు. ఆయన మా సినిమా చూసి మెచ్చుకొని ట్వీట్ వేశారు. దాంట్లో నెటిజెన్స్ అంతలా నెగటివిటీ ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో అర్థం కాలేదు. ఎవరో పగబట్టి మా సినిమాని గట్టిగా తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమైంది` అంటూ సుమంత్ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.