విజ‌యశాంతి ఇంటికి వెళ్లి మ‌రీ క్ష‌మాప‌ణ చెప్పిన సీనియ‌ర్ ఎన్టీఆర్‌.. కార‌ణం తెలుసా?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నంద‌మూరి తారక రామారావు శతజయంతి నేడు. సినీ రంగంలోనే కాకుండా రాజ‌కీయ రంగంలోనూ త‌న‌దైన ముద్ర వేసి కోట్లాది మంది ప్ర‌జ‌ల్లో గుండెల్లో ఇలవేల్పుగా మరిన సీనియ‌ర్ ఎన్టీఆర్ శ‌త‌జయంతి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు ఎన్టీఆర్ కు సంబంధించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నారు. తాజాగా లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి సీనియ‌ర్ ఎన్టీఆర్ తో త‌న‌కున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఎన్టీఆర్ గొప్ప నటుడే కాదు, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. నటుడిగా, నాయకుడిగా ఆయన ప్రయాణం తిరుగులేనిది అంటూ విజ‌య‌శాంతి కొనియాడారు. అలాగే ఓ సంద‌ర్భంగా ఆమె ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని కూడా బ‌య‌ట‌పెట్టారు. 14 ఏళ్ల‌కే సినీ గ‌డ‌ప తొక్కిన విజ‌య‌శాంతి.. `సత్యంశివం` సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ సినిమా స‌మ‌యంలో విజ‌యశాంతికి ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఏర్ప‌డింది. అయితే 1990లో ఏవీఎం స్టూడియోలో చిరంజీవితో క‌లిసి విజ‌య‌శాంత్ ఓ సినిమా చేస్తుంద‌ట‌. అదే స్టూడియోలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు ఎన్టీఆర్ డ‌బ్బింగ్ చెబుతున్నార‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న విజ‌య‌శాంతి ఎన్టీఆర్ ను క‌లిసేందుకు వెళ్లింద‌ట‌.

అయితే డ‌బ్బింగ్ స్టూడియాలో లైటింగ్ పెద్ద‌గా లేక‌పోవ‌డం ఎన్టీఆర్ విజ‌య‌శాంతిని గ‌మ‌నించ‌కుండా వెళ్లిపోయార‌ట‌. ఆ త‌ర్వాత ఆమె వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్‌.. మరుసటి రోజే ఎన్టీఆర్ ఉదయం 6 గంటలకు మద్రాసులోని విజ‌య‌శాంతి ఇంటికి వెళ్లార‌ట‌. అదే సమయానికి ఆమె షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లిపోయార‌ట‌. దాంతో `అమ్మాయిని మేము చూసుకోలేదు, పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి` అని చెప్పి వెళ్లార‌ట‌. అంతేకాదు, విజ‌య‌శాంత్ ఫోన్ నెంబ‌ర్ కూడా తీసుకుని.. కాల్ చేసి క్ష‌మాయ‌ణ చెప్పార‌ట‌. తోటి న‌టీన‌టుల‌కు ఎన్టీఆర్ ఎంత గౌర‌వం ఇచ్చేవారు చెప్ప‌డానికి ఈ సంఘ‌ట‌న స‌రిపోతుంది.