విపరీతమైన హైప్ పెంచుతున్న రవితేజ పాన్ ఇండియా సినిమా.. రంగంలోకి ఐదుగురు స్టార్ హీరోలు

మాస్ మహారాజా రవితేజకు తెలుగులో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో మాస్ సినిమాలతో యువతను అలరించిన ఆయన ఇటీవలే ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలో వరుస హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. వీటి తర్వాత విడుదలైన రావణాసుర సినిమా ఆశించిన విజయం దక్కించుకోలేదు. అయితే హిట్‌లు, ఫ్లాప్‌లను ఏ మాత్రం రవితేజ పట్టించుకోడనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా టైగర్ నాగేశ్వరరావు పేరుతో వంశీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన విషయాలు ప్రేక్షకుల్లో సినిమా పట్ల విపరీతమైన హైప్ పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన ఓ విషయం సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం వివిధ భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలు రంగంలోకి దిగనున్నారు.

రవితేజ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా రూపొందుతోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషలలో ఇది విడుదల కానుంది. ఆయా భాషల్లో ఈ సినిమా పట్ల హైప్ పెంచేందుకు ఐదుగురు హీరోలు ముందుకు రానున్నారు. ఈ సినిమా పోస్టర్‌ను హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో రజనీకాంత్ విడుదల చేయనున్నారు. ఇక కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో ఏ స్టార్ హీరో విడుదల చేస్తారో ఇంకా స్పష్టత లేదు. ఈ సినిమా విడుదలకు ముందే హైప్ పెంచేస్తోంది.


చాలా కాలం తర్వాత పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనుంది. హీరోకు సోదరి పాత్రలో ఆమె నటించనున్నారని సమాచారం. ఏదేమైనా ఇప్పటి వరకు తెలుగు సినిమాలలో అలరించిన రవితేజ పాన్ ఇండియా హీరోగా మారనున్నాడు. దీంతో ఆయన అభిమానులు ఈ సినిమా విషయంలో ఫుల్ ఖుషీగా ఉన్నారు.