సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం `శాకుంతలం`. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అయింది.
అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. సమంత అభిమానులు సైతం శాకుంతలంపై పెదవి విరిచారు. పైగా తొలిరోజు ఈ చిత్రానికి దారుణమైన వసూళ్లు వచ్చాయని ఇన్సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో శాకుంతలం ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయిందంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో శాకుంతలం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే నిన్న విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ రావడంతో.. ఆమెజాన్ ప్రైమ్ వారు శాకుంతలం టీమ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారట. ముందుగా అగ్రిమెంట్ లో అనుకున్న డేట్ కంటే ముందు ఈ సినిమాని విడుదల చేసుకునేందుకు అనుమతి ని ఇస్తే ఇరవై కోట్ల రూపాయిలు అదనంగా ఇస్తామని చెప్తున్నారట. బాక్సాఫీస్ వద్ద ఎలాగో రన్ ఉండదని భావించిన టీమ్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ అయిన నాలుగు వారాలకే అంటే మే మొదటి శుక్రవారం ఓటీటీలోకి రానుందని సమాచారం.