డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కుమార్తె, నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. భారీ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా మంచు లక్ష్మి హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. కానీ, నటిగా మంచి మార్కులే వేయించుకుంది.
ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ను రన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మంచు లక్ష్మి తన గొప్ప మనసు చాటుకుంది. ఇటీవల మూడు ముళ్ల బంధంతో ఒకటైన నవ దంపతులు మంచు మనోజ్, భౌమ మౌనిక తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తాజాగా సందర్శించారు. ఈ జంటతో పాటు మనోజ్ సోదరి మంచు లక్ష్మి ప్రసన్న కూడా వచ్చారు.
స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చల్లించుకున్నారు. దర్శనం అనంతరం యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంచు లక్ష్మి మనోజ్ మౌనిక లు కలెక్టర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలకు తగ్గట్టు మూడేళ్ల పాటు స్మార్ట్ క్లాసెస్ ను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తామంటూ పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు కూడా తెలిపారు. దీంతో మంచు లక్ష్మిపై నెటిజన్లు శభాష్, గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.