టాలీవుడ్ హిట్ డైరెక్టర్‌తో తలపతి విజయ్ సినిమా.. మరో బ్లాక్‌బస్టర్ ఖాయమేనా

విజయ్ చివరిసారిగా బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ డ్రామా ‘వారిసు’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా రూ.300 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. ఈ తరుణంలో హీరో విజయ్ మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవల నటుడు విజయ్‌కి ఒక కథను వివరించినట్లు తెలుస్తోంది. ఈ కథ తలపతి విజయ్‌ను బాగా ఆకట్టుకుందని సమాచారం. దీంతో తన తరువాతి సినిమాను గోపీచంద్ మలినేనితో చేయనున్నట్లు అర్ధం అవుతోంది. ఈ ప్రముఖ తమిళ హీరో మరో సారి తెలుగు దర్శకుడితో చేతులు కలపబోతున్నాడు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గోపీచంద్ మలినేనితో విజయ్ చేసే సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్‌ పలు ప్రాజెక్టుల్లో నిమగ్నం అయి ఉన్నాడు.

తలపతి విజయ్ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌గ్రౌండ్‌తో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా సినిమాగా ఇప్పటికే అంచనాలున్న ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల కానుంది. విజయ్ తన 68వ చిత్రం కోసం దర్శకుడు అట్లీతో చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.

అట్లీ సినిమా తర్వాతే గోపీచంద్ మలినేనితో విజయ్ సినిమా పట్టాలెక్కనుంది. గోపీచంద్ మలినేని మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌లను అందించడంలో ప్రసిద్ధి చెందాడు. చివరిగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘వీరసింహా రెడ్డి’ని గోపీచంద్ అందించాడు. 2023 తెలుగు సంక్రాంతి విడుదల భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం డబ్బింగ్ తమిళ వెర్షన్ అక్కడ ఓటీటీలో ప్రేక్షకులను బాగా అలరించింది.