యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది.
జాన్వీ కపూర్ కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథ ఇది. సాగరతీరంలో మనుషుల రూపంలో కొన్ని మృగాలతో హీరో చేసే పోరాటం ఇది. సినిమా ప్రారంభోత్సవం రోజే కొరటాల సినిమా కథను సుచాయిగా చెప్పేశారు.
ఇదిలా ఉంటే తాజాగా షూటింగ్ లోకేషన్ నుంచి ఓ షాకింగ్ పిక్ లీక్ అయింది. ఈ పిక్ ద్వారా తారక్ రోల్ తెలిసిపోయింది. ఈ సినిమాలో ఆయన జాలరి పాత్రలో నటిస్తున్నాడు. లీక్డ్ పిక్ లో కలర్ ఫుల్ షర్ట్ ధరించి మాస్ గెటప్ లో జాలరిలా తారక్ ఉన్నారు. కాలనీలో విలన్ తో గొడవపడుతున్నట్లుగా ఉంది. ఇక జాన్వీ కపూర్ ఇందులో మిడిల్ క్లాస్ పల్లెటూరి అమ్మాయిలా అలరించబోతోందని తెలుస్తోంది.