మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభోత్సవం… చిందులేయనున్న తమన్నా, రష్మిక

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరగనుంది. మ్యాచ్‌కి ముందు గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరగనుంది. 2018 తర్వాత తొలిసారి ఐపీఎల్‌లో ఓపెనింగ్ వేడుక జరగనుంది. 2023 IPL ప్రారంభ వేడుకలో నటి తమన్నా భాటియా, రష్మిక మందన్న, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యం గురువారం వెల్లడించింది. నివేదికల ప్రకారం, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు టైగర్ ష్రాఫ్ కూడా వేడుకలో చూడవచ్చు. ఈ ఇద్దరి పేర్లు ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.

టోర్నమెంట్ తొలి మ్యాచ్‌కు, ప్రారంభ వేడుకలకు మొత్తం అన్ని జట్ల కెప్టెన్లు హాజరు కావడం లేదు. ఈ వేడుకకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే హాజరుకానున్నారు. ఈ రెండు జట్ల మధ్య ప్రారంభ వేడుకల అనంతరం టోర్నీ తొలి మ్యాచ్ కూడా రాత్రి 7:30 గంటలకు జరగనుంది. టాటా ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో తాను పాల్గొననున్నట్లు రష్మిక మందన్నా వెల్లడించింది. కొన్నాళ్ల క్రితం వరకు కేవలం సౌత్ సినిమాలకే పరిమితం అయిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో సత్తా చాటుతోంది. దీంతో రష్మిక కాస్త నేషనల్ క్రష్మికగా మారిపోయింది.


పుష్ప సినిమాలో సామి సామి పాటకు ఆమె వేసిన డ్యాన్స్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. మరో వైపు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా ఈ వేడుకల్లో సందడి చేయనుంది. క్రికెట్ అభిమానులంతా ఈ ఇద్దరి ప్రదర్శన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందాల భామలు చేసే డ్యాన్స్ ప్రదర్శన అదరహో అనిపించేలా ఉంటుందని వారి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.