సినిమాల ఎంపికలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి మునుపటి జోరును చూపించడం లేదు. ఈ విషయంలో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పైగా సాయిపల్లవి పెళ్లి చేసుకోబోతుందని, వైద్యురాలిగా సెటిల్ కాబోతోందని అందుకే సినిమాలు చేయడం లేదని రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి.
దీంతో అభిమానులు మరింత కలవరపాటుకు గురవుతున్నారు. అయితే ఎట్టకేలకు సాయి పల్లవి తాజాగా ఓ కొత్త ప్రాజెక్టుకు స్క్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మళయాళ హీరో నివీన్ పౌలి తో సాయి పల్లవి ఓ సినిమా చేయటానికి సైన్ చేసింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `ప్రేమమ్` మళయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో నివీన్ పౌలి చేసిన జార్జ్ పాత్రను, సాయి పల్లవి చేసిన మిస్ మలర్ పాత్రను మలయాళ ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేదు.
అయితే ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. నివీన్ పౌలి, సాయి పల్లవి జంటగా `తారం` అనే చిత్రం చేయబోతున్నారు. వినయ్ గోవింద్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతుండగా.. వివేక్ రంజిత్ స్క్రిప్టు అందిస్తున్నాడు. మనాలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. మొత్తానికి నెట్టింట జరుగుతున్న ప్రచారానికి తెర దించుతూ సాయి పల్లవి ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేయడంతో ఫ్యాన్స్ మస్తు ఖుషీ అవుతున్నారు.