ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా జోరుగా కొనసాగుతోంది. స్టార్ హీరో కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాలు రీ రిలీజ్ చేస్తూ భారీ వసూళ్లను రాబడుతున్నారు. ఇప్పటికే ఎన్నో చిత్రాలు రీ రిలీజ్ అయ్యాడు. మరెన్నో చిత్రాలు రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి’ వచ్చి చేరింది.
ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించాడు. శ్రీ సూర్య ఫిల్మ్స్ బ్యానర్ పై ఏ.ఎం.రత్నం నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ దర్శకత్వం వహించాడు. 2001లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఆల్రెడీ ఈ మూవీని 4కే రిజల్యూషన్ లో 5.1 డాల్బీ ఆడియో క్వాలిటీతో గత ఏడాది డిసెంబర్ 31 వ తారీఖున రీ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఫుల్ రన్ లో దాదాపు రూ. 4 కోట్లకు పైగా షేర్, రూ. 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అయితే ఇప్పుడు మేకర్స్ మరోసారి ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. శివ రాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18 వ తేదీన విడుదల చెయ్యబోతున్నారు. హైదరాబాద్ లో పలు థియేటర్స్ లో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ఖుషి రీ రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్లు.. ఒకసారి రీ రిలీజ్ అయిన చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తూ పవన్ క్రేజ్ను బాగానే సొమ్ము చేసుకుంటున్నారు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.