ఫైన‌ల్‌గా ప్రియుడితో ఏడ‌డుగులు వేసిన కియారా.. ఇంత‌కీ పెళ్లి ఫోటోలు చూశారా?

బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ఫైన‌ల్ గా ప్రియుడు, బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది. కియారా-సిద్ధార్థ్ షేర్షా సినిమాలో కలిసి నటించారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రూ ప్రేమలో ఉన్నారంటూ బీటౌన్ లో వార్తులు చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి.

కానీ, కియారా-సిద్ధార్థ్ మాత్రం త‌మ ప్రేమ విష‌యాన్ని ఎప్పుడూ నేరుగా బ‌య‌ట‌పెట్ట‌లేదు. అయితే ఇప్పుడు డైరెక్టుగా పెళ్లి చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచారు. ఈ లవ్ బర్డ్స్ వివాహం మంగళవారం సాయంత్రం రాజస్థాన్‌లోని సూర్యఘడ్ కోటలో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది.

వీరి పెళ్లిలో కరణ్ జోహార్, మనీష్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, జూహీ చావ్లా, రామ్ చరణ్ మరికొందరు సెలబ్రిటీలు సంద‌డి చేశారు. త‌మ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అఫిషియల్‌గా షేర్ చేసింది కియారా. పెళ్లి వేడుకలో కియారా అద్వానీ లేత గులాబీ వర్ణం లెహంగాలో తళతళ మెరిసిపోతూ క‌నిపించింది.

అలాగే సిద్ధార్థ్ ఐవరీ షేర్వాణీ ధరించి ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌స్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా, నూత‌న దంప‌తుల‌కు అభిమానులు మ‌రియు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలుపుతున్నారు.