గత ఏడాది చివర్లో `యశోద` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు `శాకుంతలం` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయింది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.
5వ శతాబ్ధంలో మహాకవి రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా పౌరాణిక నేపథ్యంలోనే అద్భుతమైన ప్రేమ కథగా రూపుదిద్దుకున్న చిత్రమిది. శకుంతల పాత్రలో సమంత, ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే సమంత క్రేజ్, టీజర్ ట్రైలర్ పెంచిన అంచనాలను, మేకర్స్ ప్రమోషన్స్ తో ఈ చిత్రానికి కళ్లు చెదిరే రీతిలో బిజినెస్ జరుగుతోంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం శాకుంతలం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 20 కోట్ల రేంజ్ లో అమ్ముడుపోయాయట. అలాగే ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ ద్వారా మేకర్స్ కు రూ. 50 కోట్ల వరకు వచ్చాయని అంటున్నారు. దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి విడుదలకు ముందే లాభాలు వస్తుండటంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారట. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.