ఈ సంక్రాంతికి నట సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో శృతిహాసన్, హనిరోజ్ హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, రవి శంకర్ తదితరులు కీలక పాత్రను పోషించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంజనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఆ అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వీర సింహారెడ్డి ట్రైలర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. అవును. మీరు గమనించారో లేదో కానీ ఇది నిజం. అయితే ఎన్టీఆర్ ప్రత్యక్షంగా కనిపించడు. కానీ ఆయన వాయిస్ ఉంటుంది.
ట్రైలర్ లో ఓ వ్యక్తి ‘హూ ఆర్ యు?’ అనడిగితే.. అందుకు బాలయ్య `పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్లి నిలబడు.. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది`.. అని అంటారు. వెంటనే ‘జై బాలయ్య’ అనే నినాదం వినిపించడం.. బాలయ్య ‘అదీ’ అనడం ఫ్యాన్స్ ఆకట్టుకుంది. అయితే ఇంతకీ ‘జై బాలయ్య’ స్లోగన్ ను చెప్పింది మరెవరో కాదు ఎన్టీఆరే. అవును, గతంలో దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లిలో ఎన్టీఆర్ ‘జై బాలయ్య’ స్లోగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వాయిస్ కట్ చేసి ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్లో పెట్టారని రిపీట్ చేసి వింటే స్పష్టంగా అర్థమవుతుంది.