న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపుదిద్దుకున్న `హిట్ 2` చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్ కలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించారు.
డిసెంబర్ 2న రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. ఇక హిట్టు మంచి విజయం సాధించడంతో మేకర్స్ తాజాగా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
`వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో రెగ్యులర్ సినిమాలు చేయకూడదని ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. డిఫరెంట్ సినిమాలను చేస్తే చూడరు కదా.. వర్కవుట్ అవుతుందా అని చాలా మంది భయపెట్టారు. కానీ నాకు ఎక్కడో బలమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నిజమైంది. తెలుగు ప్రేక్షకులు డిఫరెంట్ సినిమాలను ఆధరిస్తారని హిట్ 2 తో మరోసారి ప్రూవ్ అయింది` అంటూ నాని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సందర్భంగా చిత్ర టీమ్ మొత్తానికి తన ప్రశంసలు తెలియజేశారు.