గుడివాడలో టీడీపీకి దరిద్రం..బరిలో ఎంతమంది?

అందివచ్చిన అవకాశాలని చెడగొట్టుకోవడంలో టీడీపీ నేతలు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..అటు కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. కానీ ఈ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ నేతలు విఫలమవుతున్నారు. పైగా సీటు కోసం కుమ్ముకుంటున్నారు. ఈ పరిస్తితి గుడివాడ నియోజకవర్గంలో క్లియర్ గా కనిపిస్తోంది.

గత రెండు ఎన్నికల్లో కొడాలి నానికి చెక్ పెట్టలేకపోయింది..పైగా అధికారంలోకి వచ్చాక నాని..చంద్రబాబుని టార్గెట్ చేసి పచ్చి బూతులు తిడుతూ వస్తున్నారు. దీంతో కొడాలిపై రాష్ట్ర స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు రగిలిపోతున్నారు. ఎలాగైనా కొడాలి ఓడిపోవాలని చూస్తున్నారు. కానీ గుడివాడలో తమ్ముళ్ళకు ఆ కసి పెద్దగా కనిపించడం లేదు. పైగా సీటు కోసం కుమ్ములాటలకు దిగుతున్నారు. అటు చంద్రబాబు సైతం బలమైన నేతకు సీటు ఫిక్స్ చేయడం లేదు. దీని వల్ల గుడివాడలో పోటీ చేసేది ఎవరు అని క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక పోటీకి రోజుకో పేరు తెరపైకి వస్తుంది.

నిజానికి గుడివాడలో కొడాలికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ..కాకపోతే అధికారంలోకి వచ్చిన సరిగ్గా పనిచేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఆ అంశాన్ని టీడీపీ క్యాష్ చేసుకోలేకపోతుంది. పైగా సీటు కోసం తన్నుకుంటున్నారు. ఇంచార్జ్‌గా రావి వెంకటేశ్వరావు ఉన్నారు..పోనీ ఆయనకు సీటు ఫిక్స్ చేశారా? అంటే అది లేదు. ఒకసారి ఏమో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరోకరు బరిలో దిగుతున్నారు..నందమూరి సుహాసిని పోటీ చేస్తారని మరోసారి. లేదు వంగవీటి రాధా గుడివాడపై ఫోకస్ పెట్టారని, ఆయనే పోటీ చేస్తారని, కాదు యువనేత శిష్ట్లా లోహిత్ రెడీ అవుతున్నారని, అటు పిన్నమనేని బాబ్జీ అని ఇలా రకరకాల ప్రచారాలు.

తాజాగా ఓ ఎన్‌ఆర్‌ఐ పోటీకి దిగుతారని ప్రచారం మొదలైంది. అయితే ఎంత డబ్బు ఖర్చు పెట్టిన గుడివాడలో లోకల్ లీడర్ మాత్రమే ఉండాలి. కొద్దో గొప్పో రావిపై సానుభూతి ఉంది, ఆయన ఇప్పుడు బాగా కష్టపడుతున్నారు కాబట్టి..ఆయనకు త్వరగా గుడివాడ సీటు ఫిక్స్ చేస్తే ఏ గోల ఉండదని టీడీపీ క్యాడర్ భావిస్తుంది.