టాలీవుడ్‌ ఎంట్రీకి మాజీ విశ్వసుందరి రెడీ అయిపోయింది… ఎవరిపక్కనో తెలుసా?

ఇండియాలో అందగత్తెలకు కొదువేమి లేదు. సంవత్సరానికొకరు మిస్ ఇండియా అనో, మిస్ యూనివర్స్ అనో, మిస్ వరల్డ్ అనో.. ఇలా రకరకాల విభాగాలలో మెరుస్తూ వుంటారు. బేసిగ్గా మోడలింగ్ రంగానికి చెందినవారు ఇలా అందాల పోటీలలో పార్టిసిపేట్ చేస్తూ వుంటారు. అంతవరకూ ఓకే కానీ… ఒక్కసారి కిరీటం దక్కించుకోగానే వారికి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. అలా వచ్చిన వేళల్లో సూపర్ స్టార్ స్థాయిని అందుకున్నవారు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఐశ్వర్య రాయ్ ని తీసుకోవచ్చు. అలాగే సుష్మిత సేన్ కూడా.

ఇలా వారికి అందాల పోటీలో కిరీటం దక్కిన వెంటనే అలా ప్రొడ్యూసర్స్ వారిని సినిమాలలో బుక్ చేస్తూ వుంటారు. తాజాగా అలాగే ఒకరి విషయంలో జరిగింది. 2017 మిస్ వరల్డ్ మీకు గుర్తుందా? అదేనండి మానుషి చిల్లర్‌. ఆమెని మనవాళ్ళు ఓ సినిమాకోసం బుక్ చేసారు. హీరో మరెవరో కాదు, మెగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్. ఈమధ్యనే జరిగిన ముంబై మొదటి షెడ్యూల్‌లో ఈ జంటపై కొన్ని కీలకమైన సన్నివేశాలు, పాటను చిత్రీకరించారని ఓ న్యూస్ లీకైంది. ఇక, ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతుంది.

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా మొత్తం 5 భాషల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. తాజాగా మొదలైన షూటింగ్ ముంబైలో జరిగినట్టు భోగట్టా. ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు జోడీగా నటించే హీరోయిన్ గురించి ఆమధ్య ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేసాయి. ఆఖరికి ఆ అవకాశం మిస్ వరల్డ్ కి చిక్కింది.