టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని ప్రారంభించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్లో ఓ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేశారు. ఇక దసరా పూర్తయిన వెంటనే రెండో షెడ్యూల్ను ప్రారంభించాలని మేకర్స్ భావించారు. కానీ అంతలోనే మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూయడంతో సెకండ్ షెడ్యూల్ ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ కథపై మరింత కసరత్తు చేశారట. అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మహేష్ ను కన్విన్స్ చేశారట.
ఇందులో భాగంగానే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ మార్పుల కారణంగా ఫస్ట్ షెడ్యూల్లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశం మొత్తాన్ని తీసేస్తున్నారట. దీంతో ఆ యాక్షన్ సీన్ కోసం మహేష్ పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అని, అలాగే ఆ సన్నివేశం కోసం ఖర్చు పెట్టిన బడ్జెట్ మొత్తం వేస్టే అని ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా అవుట్ పుట్ను దృష్టిలో పెట్టుకునే త్రివిక్రమ్ ఆ యాక్షన్ సన్నివేశాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.