టీడీపీలో రెడ్డి వారసుడు ఎంట్రీ..నిలబడతాడా..!

వచ్చే ఎన్నికల్లో పలువురు సీనియర్ నేతలు..తమ వారసులని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి..ప్రజల్లో తిప్పుతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కించుకుని తనయులని బరిలోకి దింపాలని చూస్తున్నారు. అయితే ఇటీవల జగన్..వైసీపీలో వారసులకు సీటు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. దీంతో మళ్ళీ సీనియర్ నాయకులే పోటీ చేయాల్సిన పరిస్తితి వచ్చింది.

టీడీపీలో మాత్రం చంద్రబాబు యువతకు 40 శాతం సీట్లు అని ప్రకటించేశారు. ఈ క్రమంలోనే కొందరు వారసులకు కూడా సీటు ఇస్తారని తెలిసింది. అటు సీనియర్ నేతలు కూడా తాము తప్పుకుని, తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతల వారసులకు బాబు లైన్ క్లియర్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా నెల్లూరు జిల్లాలో రెడ్డి వర్గానికి చెందిన టీడీపీ నేత పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడు దినేశ్ రెడ్డికి కోవూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.

2014 ఎన్నికల్లో పొలంరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై విజయం సాధించారు..ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి పొలంరెడ్డి..ప్రసన్న కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత పొలంరెడ్డి..కోవూరులో పెద్దగా యాక్టివ్ గా పనిచేయడం లేదు. కాస్త వయసు మీద పడుతుండటంతో శ్రీనివాసులు రెడ్డి దూకుడుగా ఉండటం తగ్గించారు. దీంతో అక్కడ క్యాడర్ పరిస్తితి అయోమయంలో పడింది. ఇదే క్రమంలో పొలంరెడ్డి వారసుడు ఎంట్రీ ఇచ్చి నియోజకవర్గంలో పనిచేయడం మొదలుపెట్టారు.

ఇక శ్రీనివాసులు రెడ్డి కూడా తన తనయుడుని నియోజకవర్గంలో యాక్టివ్ గా తిప్పుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో సీటు కూడా తన తనయుడుకే దక్కేలా చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు..కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పొలంరెడ్డితో సమీక్షా సమావేశం నిర్వహించి.. కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పోలంరెడ్డి దినేశ్‌ రెడ్డిని ఖరారు చేశారు. ఇక యువ నాయకుడుకు పదవి దక్కడంతో కోవూరు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. మరి పొలంరెడ్డి వారసుడు కోవూరులో సత్తా చాటుతాడో లేదో చూడాలి.