రవితేజ – కృష్ణవంశీ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. రవితేజని సింధూరం అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశాడు దర్శకుడు కృష్ణ వంశీ. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక సింధూరం సినిమాలోని పాటలు కూడా అప్పటి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. దానికంటే ముందే నాగార్జున హీరోగా నటించిన ‘నిన్నే పెళ్ళాడతా’ లో కూడా రవితేజకి ఓ ఛాన్స్ ఇచ్చాడు కృష్ణవంశీ. అటు తర్వాత వీళ్ళు ‘సముద్రం’ ‘ఖడ్గం’ అనే సినిమాలకు కూడా పనిచేసారు.
రవితేజ, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ లు రాంగోపాల్ వర్మ దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్ లుగా పనిచేసేవారు. కాబట్టి వీళ్ళ ముగ్గురికి మంచి స్నేహం ఉందని టాలీవుడ్లో కధలు కధలుగా చెప్పుకుంటారు. అయితే ఈమధ్య ఎందుకోమరి, కృష్ణవంశీతో రవితేజకి చెడిందనే అనుమానాలు టాలీవుడ్లో వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం కృష్ణ వంశీ.. రవితేజ గురించి మాట్లాడడానికి కూడా ఆసక్తి చూపకపోవడమే. అవును…. ఇటీవల ‘నిన్నే పెళ్ళాడతా’ చిత్రం 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కృష్ణవంశీ.
ఈ ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు కృష్ణవంశీ. యాంకర్ కూడా పనిలో పనిగా ఈ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన రవితేజ గురించి కృష్ణవంశీని ఓ ప్రశ్న అడిగాడు. సింధూరంలోనే రవితేజ మాస్ ఎలిమెంట్ కనిపించింది. ఆయనే ఇలా చేశారా, మీరే అలా చేయమని చెప్పారా? అని యాంకర్ ప్రశ్నించగా, దర్శకుడు కృష్ణవంశీ మాత్రం రవితేజ గురించి మాట్లాడలేదు. నెక్స్ట్ క్వశ్చన్ అంటూ దాటేశాడు. దాంతో ఆ ఇంటర్వ్యూలో మొత్తంలో ఇదే హైలెట్ అయ్యింది. రవితేజ – కృష్ణవంశీలకి ఏ విషయంలో మనస్పర్థలు వచ్చాయి అనే విషయంపైన ఇపుడు డిస్కషన్లు మొదలయ్యాయి.