షూటింగ్‌లో భాగంగా విశాల్‌కు జరిగిన ప్రమాదం.. అభిమానుల ఆందోళన!

బేసిగ్గా తెలుగు వాడైన త‌మిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ‘పందెం కోడి’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చేరువయ్యాడు హీరో విశాల్. ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న న‌టించిన సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులో కూడా విడుద‌ల అయ్యి మంచి విజయాలు నమోదు చేస్తున్నాయి. అందుకే చాలామంది తమిళ హీరోల్లాగే ఇతగాడికి కూడా ఇక్కడ మంచి మార్కెట్ వుంది. ప్రస్తుతం ఆయ‌న న‌టిస్తున్న చిత్రం పేరు ‘మార్క్ ఆంటోని’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ప్రస్తుతం చెన్నైలో ఒక షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో తాజాగా అనుకోని ప్రమాదం జరిగింది.

గురువారం అనగా ఈరోజు తెల్ల‌వారుఝామున సదరు చిత్రంలోని ఫైట్ సీక్వెన్స్ చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు విశాల్ తీవ్రంగా గాయపడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్ర‌థ‌మ చికిత్స అనంత‌రం విశాల్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తోంది. విశాల్‌కు గాయాలు కావ‌డంతో ‘మార్క్ ఆంటోనీ’ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. తమిళ సినీ వర్గాలు ఈ వార్త‌ను తాజాగా ధ్రువీక‌రించాయి. విష‌యం తెలిసిన అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పోస్టులు పెడుతున్నారు.

SJ సూర్య కీలక పాత్రలో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా, GV ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇకపోతే సినిమా కోసం ఎంత‌టి రిస్క్ తీసుకోవ‌డానికైనా ముందు ఉంటాడు విశాల్‌. గ‌తంలో కూడా ప‌లు చిత్రాల షూటింగ్ స‌మ‌యాల్లో విశాల్ గాయపడిన ఉదంతాలు మనం చూశాం. ఇటీవ‌ల లాఠీ షూటింగ్‌లోనూ ఆయ‌న‌కు ప‌లుమార్లు గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.