ఉదయ్ కిరణ్‌కు ‘ అత‌డు ‘ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎవ‌రి వ‌ల్ల మిస్ అయ్యింది…!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొకరు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ తరహా సినిమాలు ఒక్కోసారి కొందరి హీరోల జీవితాన్ని మార్చేస్తే.. మరికొన్నిసార్లు హీరోలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదు. అలాంటి సినిమాల్లో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అతడు ఒకటి అని చెప్పవచ్చు. నిజానికి ఈ సినిమాలో హీరోగా చేసే ఛాన్స్ దివంగత హీరో, టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ కి దక్కింది. కానీ ఒకరి వల్ల ఉదయ్ కిరణ్ ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది.

సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై అతడు సినిమాని నిర్మించారు. సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేదు లేదు కానీ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. అయితే ఈ సినిమాని మొదట ఉదయకిరణ్ తో చేయాలని నిర్మాత మురళీ మోహన్ భావించారట. ఈ విషయాన్ని స్వయానా ఆయనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ… “ఉదయ్ కిరణ్ మొదటి సినిమా ‘చిత్రం’ చూసి ఈ అబ్బాయి ఎవరో చాలా బాగున్నాడు అని అనుకున్నాను. బుద్దిమంతుడిలా కనిపించడమే కాకుండా అతనిలోని నటనా చాతుర్యం నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే ఫోన్ చేసి చాలా బాగా నటించావు అబ్బాయి అని అభినందనలు తెలిపాను. అలాగే ‘ఓసారి మాట్లాడదాం. వచ్చి కలువు’ అని చెప్పాను. అప్పుడు ఉదయ్ కిరణ్ మీరు నాకు ఫోన్ చేయడమే చాలా సంతోషం సార్ అని ఆనందంగా బదులిచ్చాడు.

తర్వాత ఉదయ్ కిరణ్ తరచుగా మా ఇంటికి వస్తుండేవాడు. అప్పుడే అతడు సినిమాలో అతన్ని హీరోగా నటింపజేయాలని అనుకున్నాను. ఈ విషయం గురించి చెప్పగానే.. కచ్చితంగా చేస్తానని ఉదయ్‌కిరణ్ అన్నాడు…..”కానీ అదే టైమ్‌లోనే చిరంజీవి కూతురుతో ఉదయ్ కిరణ్ కి పెళ్లి నిశ్చయం అయింది. కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ అతడు చాలా తికమకికి గురయ్యాడు.

ఆందోళన, బాధలో ఉన్నట్లు అనిపించింది. అతడు సినిమాకి ఒప్పుకున్నాడు కదా అని డేట్స్ కోసం కాల్ చేసి అడిగాను. అప్పుడు ‘సారీ అండీ.. డేట్లు అడ్జస్ట్ చెయ్యలేకున్నాను.. వేరే మూవీ వాళ్లకి డేట్స్ ఇచ్చేసాను’ అని చెప్పాడు. దాంతో అతని పరిస్థితి అర్థం చేసుకున్నాను నేను. తర్వాత మహేష్ బాబుతో సినిమా తెరకెక్కించాం’ అని చెప్పుకొచ్చాడు మురళీ మోహన్ వెల్లడించారు.