ముగ్గురు హీరోయిన్లతో ఆడిపాడిన నాగచైతన్య.. వారి గురించి ఏమన్నాడంటే

అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన పెద్ద కొడుకు నాగచైతన్య ప్రేమ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. భారీ హిట్లు లేకపోయినా, ప్రేక్షకుల హృదయాలను తాకే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తొలి సినిమా జోష్ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ప్లాఫ్ అనే మాట రాకుండా చక్కటి కథలతో కూడిన సినిమాలు చేస్తున్నాడు. సమంతతో చేసిన ఏం మాయ చేశావే, మజిలీ, మనం, ముగ్గురు హీరోయిన్లతో చేసిన ప్రేమమ్ వంటి సినిమాలు అతడి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తాజాగా అతడు హీరోగా తెరకెక్కిన ‘థాంక్యూ’ మూవీ త్వరలో విడుదల కానుంది. అందులోనూ అతడు ముగ్గురు భామలతో కలిసి నటించారు. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా తెరకెక్కింది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ నటించారు. ఈ సినిమా జులై 22న థియేటర్లలో విడుదల కానుంది. దీనికి సంబంధించి ప్రమోషన్లలో భాగంగా పలు ఛానళ్లకు వరుసగా నాగచైతన్య ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాను గతంలో ప్రేమమ్ సినిమాలోనూ ముగ్గురు హీరోయిన్లతో నటించానని, ఆ సినిమాకు దీనికీ చాలా తేడా ఉంటుందని నాగచైతన్య తెలిపాడు.

16 నుంచి 36 ఏళ్ల వరకు మూడు వేరియషన్లలో తన పాత్రలు ఉంటాయన్నాడు. టీనేజర్‌గా కనిపించేందుకు చాలా కష్టపడ్డానని, బాగా బరువు తగ్గేందుకు కసరత్తులు చేసినట్లు తెలిపాడు. ఇక ఇందులో నటించిన రాశిఖన్నా పాత్రను దర్శకుడు బాగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారన్నారు. యూత్ ఎక్కువగా ఇష్టపడేలా మాళవిక నాయర్ పాత్ర ఉంటుందన్నారు. ఇక అవికాగోర్ పాత్ర సహజసిద్ధంగా కనిపిస్తుందన్నారు. టీనేజర్‌గా, యువకుడిగా, మధ్య వయస్కుడిగా భిన్న పాత్రలు ఛాలెంజింగ్‌గా అనిపించాయన్నారు. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.