దిగ్గజ లెజెండ్రీ స్పిన్నర్ షేన్వార్న్ మృతి నుంచి కోలుకోక ముందే క్రికెట్ ఆస్ట్రేలియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మరో స్టార్ క్రికెటర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. క్విన్స్లాండ్లోని టౌన్స్విల్లే ప్రాంతంలో గత రాత్రి జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ మృతి చెందాడు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు లెజెండ్రీ క్రికెటర్లు మృతి చెందడం ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకు తీరని లోటు.
సైమండ్స్ తన ఆల్రౌండర్ ప్రదర్శనతో కంగారు జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 1998లో జాతీయ జట్టులోకి వచ్చిన సైమండ్స్ చాలా తక్కువ కాలంలోనే స్టార్ క్రికెటర్గా ఎదిగాడు. ఆసీస్ గెలిచిన మూడు వరల్డ్ కప్లల్లో కూడా సైమండ్స్ సభ్యుడిగా ఉన్నాడు. 2012లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కి ముగింపు పలికాడు.
ఆసీస్ జట్టు తరపున సైమండ్స్ 198 వన్డేలు ఆడిన సైమండ్స్ 5,088 పరుగులు, 133 వికెట్లు పడగొట్టాడు. 26 టెస్టు మ్యాచ్లు ఆడి 1462 పరుగులతో పాటు 26 వికెట్లు తీశాడు. టీ 20ల్లో 14 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించిన సైమండ్స్ 337 పరుగులు, 8 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్కు ఆడాడు. సైమండ్స్ మృతి పట్ల పలువురుక్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
2008లో సిడ్నీ వేదికగా ఇండియా, ఆసీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో సైమండ్స్, భారత స్పిన్నర్ హర్జభన్ సింగ్ మధ్య జరిగిన వివాదం ఎప్పటకీ గుర్తుండి పోతుంది. సైమండ్స్ హర్భజన్ తనను కోతి అన్నాడని ఆరోపిస్తే.. బజ్జీ తాను మా… కీ అన్నానని చెప్పాడు. చివరకు క్రికెట్ ఆస్ట్రేలియా హర్భజన్దే తప్పంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతనిపై మూడు మ్యాచుల నిషేధం విధించింది.
అప్పుడు భారత జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే భజ్జీపై విధించిన నిషేధం ఎత్తివేయకపోతే సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వస్తుందని చెప్పడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వెనక్కి తగ్గింది. భజ్జీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఇలా ఈ వివాదం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది.