నయనతార లైఫ్‌లో ఎవరికీ తెలియని విషయాలివే..!

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అంటే ఎవరైనా టక్కున నయనతార అని చెప్పేస్తారు. ఆమె అసలు పేరు డయానా మరియమ్ కురియన్. ఏదో ఒక్క సినిమా చేద్దామనుకుని సినీ ఇండస్ట్రీలోకి ఆమె వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు, ఎన్నో వివాదాలను మూటగట్టుకుని నిత్యం వార్తల్లో ఉంటుందీమె. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ఇండస్ట్రీలలో ఎన్నో సినిమాలు చేసి, అసంఖ్యాక అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆమె తన జీవితంలో తెలిసో, తెలియకో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వేసిన తప్పటడుగులు ఒకానొక దశలో కెరీర్‌ను ప్రమాదంలో పడేశాయి. అయితే తనలో సత్తా అయిపోలేదని నిరూపిస్తూ తన కెరీర్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుకుంది. ఇక ఆమె జీవితంలో ఎన్నో మలుపులు, ఎవరికీ తెలియని రహస్యాలు ఉన్నాయి.

వల్లవన్(తెలుగులో వల్లభ) సినిమా షూటింగ్ సమయంలో హీరో శింబుకు ఆమె ఎంతో దగ్గరైంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే వదంతులు వచ్చాయి. వాటిని నిర్ధారణ చేస్తూ వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు లీక్ అయ్యాయి. ఫలితంగా ప్రపంచానికి వీరి బంధం గురించి తెలిసింది. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా కొన్నాళ్లకే వారు విడిపోయారు.

శింబుతో ఆమె ప్రేమ ముగిసిన కొన్నాళ్లకే మరో కొత్త బంధం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. డ్యాన్స్ మాస్టర్ కం డైరెక్టర్ ప్రభుదేవాతో ఆమె ప్రేమలో పడింది. అదే సమయంలో ప్రభుదేవా హిందీలో డైరెక్టర్‌గా నిలదొక్కుకుంటున్నాడు. ఇక నయనతార కూడా సౌత్ ఇండస్ట్రీలో బిజీగా ఉంది. ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆమె హిందూ మతంలోకి కూడా మారింది. అప్పటికే ప్రభుదేవాకు రమాలత్‌తో వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న రమాలత్ అగ్గిమీద గుగ్గిలమైంది. నయనతార పరువు మొత్తం తీసేసింది. ఒకానొక దశలో ఆమెకు రూ.12 కోట్లు నయనతార ఇవ్వజూపినట్లు వార్తలు వచ్చాయి. ఏమైందో తెలియదు కానీ ప్రభుదేవాతో కూడా ఆమె బంధానికి ఫుల్ స్టాప్ పడింది.

ఇలా తప్పటడుగులు వేసి జీవితంలో నయనతార ఎంతో దెబ్బతింది. ఈ వ్యవహారాలన్నీ ఆమె కెరీర్‌కు ఓ మచ్చలా మిగిలిపోయాయి. ఓ దశలో 3 సంవత్సరాల పాటు ఆమె సినిమాలకు దూరంగా ఉంది. జరిగినవి మర్చిపోయేందుకు ఆధ్యాత్మికంలో మునిగిపోయింది. కేరళకు వెళ్లి ఓ ప్రముఖ దేవాలయంలో దర్శనానికి సల్వార్‌లో బయల్దేరింది. అలా రావడం కుదరదని ఆలయ పూజారులు చెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగింది. అనంతరం క్షమాపణ చెప్పింది.

నయనతార, విజయ్ సేతుపతి జంటగా ‘నేనూ రౌడీనే’ అనే సినిమా ధనుష్ నిర్మించాడు. సినిమా మధ్యలో నిర్మాణ వ్యయం అనుకున్నదానికంటే ఎక్కువ కావడంతో ధనుష్ చేతులు ఎత్తేశాడు. ఆ సమయంలో సినిమా ఖర్చంతా నయనతార భరించి, సినిమాను పూర్తి చేసింది. తన మంచి మనసును చాటుకుంది. ఇక సినిమాలు పూర్తైన తర్వాత సెట్‌లోని అందరికీ డబ్బులు ఇచ్చే మంచి మనసు ఆమె సొంతం.

నయనతార-ఆర్య పెళ్లి చేసుకున్నట్లు ఫొటోలు 2013లో హల్ చల్ చేశాయి. అయితే సినిమా ప్రమోషన్ కోసమే అలా చేసినట్లు ఆమె చెప్పడంతో వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. తమిళ కమెడియన్ ప్రేమ్ గి ఆమెను ఓ సినిమా షూటింగ్‌లో ఆంటీ అని పిలిచాడు. ఒక్కసారిగా కోపంతో అగ్గిమీద గుగ్గిలమైంది. ఇంకోసారి అలా పిలవొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది.

ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న ఆమె సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసేసుకుంది. ఓ గుడికి వెళ్లినప్పుడు పెళ్లైన మహిళల మాదిరిగా నుదుట సింధూర తిలకం పెట్టుకోవడంతో విషయం బయటపడింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల రెమ్యూనరేషన్‌ను ఆమె తీసుకుంటుందని టాక్. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ, తన చరిష్మా కారణంగా నిర్మాతలకు లాభాలు రప్పిస్తోంది. ఇలా తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ, తన జీవితాన్ని తానే సరిదిద్దుకుంది.