జబర్దస్త్ కు సుడిగాలి సుధీర్ టీం గుడ్ బై.. నిజమేంటంటే ..!

మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం కు జనాల్లో ఉన్న ఆదరణ గురించి తెలిసిందే. ఈ కామెడీ షో ప్రారంభమై 10 ఏళ్లు దాటినా ఇప్పటికీ కూడా క్రేజ్ వుంది. ఈ షో ప్రారంభమైన కొద్ది నెలల తరువాత సుడిగాలి సుధీర్ టీం ఏర్పడింది. ఈ టీంలో సుధీర్ తో పాటు గెటప్ శీను, రాంప్రసాద్ కీలక సభ్యులు. జబర్దస్త్ లో పాటిస్పేట్ చేస్తున్న ఎంతోమంది కంటెస్టెంట్ లు బయటకు రావడం, మళ్లీ జబర్దస్త్ లోకి తిరిగి పోవడం జరిగింది. కానీ సుడిగాలి సుధీర్ టీం మాత్రం పదేళ్లుగా ఈ షోను వీడలేదు.

అయితే తాజాగా జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు సుడిగాలి సుధీర్ టీం సభ్యులు సుధీర్, శ్రీను, రాంప్రసాద్ తెలిపారు.ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో స్వయంగా వారే ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ మేము ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాం. కానీ ఈ వేదికపై చెప్పాల్సి వస్తోంది. ఇకపై జబర్దస్త్ నుంచి మేము వెళ్లి పోవాలని అనుకుంటున్నాం.మమ్మల్ని క్షమించండి.’ అంటూ చెప్పారు. కొద్దిరోజులుగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులకు సినిమాల్లో అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే జబర్దస్త్ లో చేస్తున్న కారణంగా వాళ్ళు ఎక్కువ సినిమాల్లో నటించడానికి ఆస్కారం లేకుండా పోతోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల జబర్దస్త్ కాంట్రాక్ట్ రెన్యువల్ పేపర్లపై సంతకం చేసేందుకు సుడిగాలి సుధీర్ టీం అంగీకారం తెలపలేదంటూ వార్తలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఈ ముగ్గురు జబర్దస్త్ ను వీడిపోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ వేదికగా తాము ఈ కార్యక్రమం నుంచి వైదొలుగుతున్నట్లు సుధీర్ గాలి సుధీర్ టీం ప్రకటించింది.

అయితే సుధీర్ టీం చేసిన వ్యాఖ్యల పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వాళ్లు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నది నిజమేనని కొందరు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం స్కిట్ లో భాగంగానే అలా యాక్టింగ్ చేసి ఉంటారని అంటున్నారు. సుడిగాలి సుధీర్ టీం జబర్దస్త్ నుంచి వెళ్లి పోతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ టీం సభ్యులు ఫన్నీగా ఇలా స్కిట్ చేశారేమో..అని అంటున్నారు. మరి ఈ ఎపిసోడ్ ప్రసారం అయితేనే నిజం ఏంటో తెలిసే అవకాశం ఉంది.