ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మించారు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ నటుడు సునీల్ ఈ చిత్రంలో విలన్లు నటించారు.
భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న సౌత్ భాషలతో పాటు హిందీలోనూ విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ సొంతం చేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతోంది. ఇదిలా ఉంటే.. పుష్ప నిర్మాతలను డైరెక్టర్ సుకుమార్ దారుణంగా ముంచేశారని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అసలు ఏం జరిగిందంటే.. రెండున్నర నుంచి మూడు గంటల సినిమా కోసం కొందరు దర్శకులు నాలుగు, నాలుగున్నర గంటల ఫుటేజ్ తీస్తారు. చివర్లో దాన్ని అంతా ఎడిట్ చేస్తారు. అలాగే సుకుమార్ కూడా దాదాపు పుష్ప ఫస్ట్ పార్ట్ కోసం నాలుగైదు గంటల ఫుటేజ్ తీసి.. చివరకు మూడు గంటల సినిమాగా ఎడిటింగ్ చేశాడు.
అయితే అలా ఎడిటింగ్ టేబుల్ మీద పోయిన ఫుటేజ్కు దాదాపు రూ.25 నుంచి 30 కోట్ల వరకు ఖర్చు పెట్టారని ఇండస్ట్రీల వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంటే సుకుమార్ భారీ తనంలో నిర్మాతలకు దాదాపు రూ.30 కోట్ల వరకు నష్టం వాటిల్లిందట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. నెట్టింట మాత్రం ఈ మ్యాటర్ జోరుగా వైరల్ అవుతోంది.